జగన్ నోట మళ్లీ 'మావిగన్'.. సీఎం చంద్రబాబుపై ఫుల్ ఫైర్
లండన్ పర్యటన ముగిసిన తర్వాత తాడేపల్లికి వచ్చిన మాజీ సీఎం జగన్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.
By: Tupaki Political Desk | 21 May 2026 2:52 PM ISTఏపీ రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా, తన పాత ప్రతిపాదన ‘మావిగన్’నే ప్రజల మద్దతు ఉందంటూ తాజాగా వ్యాఖ్యానించారు జగన్. మావిగన్ పేరు వింటేనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీపీ పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టం, ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు.
లండన్ పర్యటన ముగిసిన తర్వాత తాడేపల్లికి వచ్చిన మాజీ సీఎం జగన్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. దాదాపు 20 రోజుల తర్వాత జగన్ మీడియా ఎదుటకు రావడం, ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపింది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై మీడియాతో మాట్లాడిన జగన్ రాజధానిపైనా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కాముల కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నిర్ణయాల వల్ల భవిష్యత్తులోనూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే అమరావతి కోసం రూ.47 వేల కోట్ల అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా మావిగన్ ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టలి. మావిగన్ లో అన్నీ ఉన్నాయని జగన్ వివరించారు. ప్రజలు కూడా మావిగన్ కు మద్దతు పలికారని, అది తట్టుకోలేకే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆక్షేపించారు.
