అధికారం శాశ్వత మనుకుని.. ఎందుకూ కొరగాని రుషికొండ-శీష్ మహల్!
ఉచితాలు తమకు తోడుగా ఉంటాయని కలల నిచ్చెనలు వేసుకుని ఆకాశ హర్మ్యాల్లో విహరించారు.
By: Tupaki Desk | 10 Feb 2025 8:30 PMవచ్చే 30 ఏళ్లు మనదే అధికారం అని వైసీపీ అధినేత జగన్, వచ్చే పాతికేళ్లు మావే అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదే పదే చెప్పుకొచ్చారు. అధికారం తమకే శాశ్వత మనుకున్నారు. అధికా రం నుంచి తమను దింపే శక్తి ఎవరికీ లేదనుకున్నారు. ఉచితాలు తమకు తోడుగా ఉంటాయని కలల నిచ్చెనలు వేసుకుని ఆకాశ హర్మ్యాల్లో విహరించారు. కానీ.. ప్రజాస్వామ్యంలో జనం నాడిని వారు పట్టుకోలేక పోయారు. అధికారం కోల్పోయారు.
కానీ, వారు పోతూ పోతూ.. మిగిలిన వందల కోట్ల రూపాయల 'బంగళాలు'.. నేడు ఎటూ కొరగాకుండా పోతు న్నాయి. వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషి కొండను తొలిచి.. ఇంద్ర భవనం నిర్మించారు. ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన ఖరీదైన వస్తువులతో అలంకరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ రుషి కొండ ప్యాలెస్ ఖర్చు.. రూ.500 కోట్ల పైమాటేనని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. ఇంత ఖర్చు చేసినా.. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయాక.. అది నిర్జీవంగా మారిపోయింది.
కూటమి సర్కారుకు ఈ భవంతిని ఏం చేయాలో తెలియక.. పర్యావరణ అనుమతులు లేకపోవడంతో ఎవరూ తీసుకునేందుకు కూడా ముందుకు రాక.. సదరు భవంతి.. ఖాళీగా విలపిస్తోంది. కట్ చేస్తే.. ఇదే పరిస్థితి ఢిల్లీలోనూ కనిపిస్తోంది. ఏపీలో 500 కోట్లతో నిర్మిస్తే.. ఢిల్లీలో ఏకంగా 374 కోట్ల రూపాయల(బీజేపీ లెక్క ప్రకారం)తో నిర్మించిన శీష్ మహల్(అద్దాల మేడ) ఇప్పుడు ఎటూ కొరగాకుండా పోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్.. సీఎంగా ఉండగా.. అధికారిక నివాసాన్ని అధునాతన వసతులతో నింపేశారు.
దీనికి కారణం.. వచ్చే 25 సంవత్సరాలు ఆప్ అధికారంలో ఉంటుందనే అత్యాస. కానీ, తాజా ఎన్నికల్లో ఆప్ చిత్తుగా ఓడిపోయింది. ఆ వెంటనే ఈ అధికారిక నివాసం ఖాళీ అయింది. కానీ, ఇప్పుడు దీనిని తీసుకునేందుకు.. వచ్చే కొత్త సీఎం దీనిలో ఉండేందుకు.. బీజేపీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ``మా సీఎం శీష్ మహల్లో ఉండరు. అది మాకు అవసరం లేదు`` అని బీజేపీ అగ్రనాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అంటే.. బీజేపీ కొత్త సీఎం ఎవరైనా.. ఈ భవనంలోకి అడుగు పెట్టే అవకాశం లేదు. దీంతో రూ.374 కోట్ల రూపాయల ఖర్చు అరవింద్ కేజ్రీవాల్ అత్యుత్సాహానికి, అతికి ఆవిరయ్యాయంటూ.. నెటిజన్లు ఆరోపిస్తున్నారు.