రాబోయే ఎన్నికల ఫలితాలు చెబుతున్న జగన్!
అవును... తాడేపల్లిలో పార్టీ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో జగన్ పలు వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 8 May 2025 3:53 AMఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇంకా ఏడాది కాని సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలన చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, వీలైనంత త్వరలో ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు! తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు!
అవును... తాడేపల్లిలో పార్టీ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకాన్ని ఆపేయడంతో పాటు.. చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. రాష్ట్రంలో అవినీతి స్పష్టంగా కళ్లకు కనబడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
2024 ఎన్నికలు పూర్తి కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని.. ఓటు అనే వారి ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన శాస్త చేస్తారని జగన్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ స్పష్టం చేశారు. నాయకులంతా గ్రామస్థాయిలోకి వెళ్లి పని చేయాలని సూచించారు.
ఇదే సమయంలో... ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇక అబద్దాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఏలా ఉంటుంది? అని ప్రశ్నించిన జగన్... 2014లో కూడా చంద్రబాబు ఇలానే తానిచ్చిన హామీలు అమలు చేయలేదని.. ఆ సమయంలో మనం పాదయాత్ర చేసి, ప్రజలకు భరోసా ఇచ్చామని తెలిపారు.
2019 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు ఎన్నికల ఫలితాలో కనిపించిందని.. ఆ సమయంలో ప్రజావ్యతిరేకత చీల్చడానికి చంద్రబాబు తన రాజకీయ భాగస్వామిని సింగిల్ గా పోటీ చేయించినా.. చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపోయారని జగన్ తెలిపారు. అయితే... జగన్ ఇలా ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పడం అంటే.. జమిలీని దృష్టిలో పెట్టుకునా లేక కేడర్ చల్లబడకుండానా అనే చర్చ మొదలైంది.