Begin typing your search above and press return to search.

ఆవేశం - అన‌ర్థం.. జ‌గ‌న్ తెలుసుకోవాలి ..!

ఆవేశం ఎవ‌రికీ ప‌నికిరాదు. అది రాజ‌కీయ నాయ‌కులైనా.. వ్య‌క్తులైనా. ఒక‌టే ఫార్ములా వ‌ర్తిస్తుంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం లో ఉన్న వైసీపీ అయితే.. మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

By:  Tupaki Desk   |   10 April 2025 7:15 AM
ఆవేశం - అన‌ర్థం.. జ‌గ‌న్ తెలుసుకోవాలి ..!
X

ఆవేశం ఎవ‌రికీ ప‌నికిరాదు. అది రాజ‌కీయ నాయ‌కులైనా.. వ్య‌క్తులైనా. ఒక‌టే ఫార్ములా వ‌ర్తిస్తుంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం లో ఉన్న వైసీపీ అయితే.. మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌తిమాట‌ను ఆచి తూచి వాడాలి. అయితే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. అధికారం పోయింద‌న్న ఆవేద‌నో.. లేక‌.. పార్టీ నాయ‌కుల‌పై కేసులు న‌మోదు కావ‌డం, పార్టీ పుంజుకునే ప‌రిస్థితి కూడా లేక‌పోవంతో త‌లెత్తిన‌ ఆక్రోశ‌మో తెలియ‌దు కానీ.. జ‌గ‌న్ క‌ట్టు త‌ప్పుతున్నారు.. నోరు విప్పుతున్నా రు. దీంతో లేనిపోని స‌మ‌స్య‌లు కొని తెచ్చుకుంటున్నారు.

సాధార‌ణంగా.. ఒక పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. స‌ద‌రు పార్టీ అదికారంలో ఉన్న‌ప్పుడు చేసిన కార్య‌క్ర‌మాల కార‌ణంగా అంతో ఇంతో సానుభూతి పెరుగుతుంది. అది ఏ పార్టీకైనా వ‌ర్తిస్తుంది. 2021-22 మ‌ధ్య టీడీపీ విష‌యంలో అదే జ‌రిగింది. దీనిని అందిపుచ్చుకున్న చంద్ర‌బాబు..వెంట‌నే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు కాక రేపారు. ఫ‌లితంగా.. ఆయ‌న అరెస్టుపై తెలుగు జాతి మొత్తం స్పందించింది. ఇలా.. ఒక సానుభూతిని పెంచుకుని.. దానిని కొన‌సాగించే కార్య‌క్ర‌మానికి పార్టీలు సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఇదే పార్టీల‌కు వెన్నుద‌న్నుగా కూడా మారుతుంది.

మ‌రి ఈ కోణంలో చూసుకుంటే.. వైసీపీ విష‌యంలో సానుభూతి పెర‌గ‌క‌పోగా.. మ‌రింత వివాదాల సుడిలో చిక్కుకుపోతోంది. వైసీపీ అధినేత చేస్తున్న వ్యాఖ్య‌లు.. పార్టీని మ‌రింత భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయ‌న్న ఆవేద‌న‌.. ఆందోళ‌న కూడా.. పార్టీ సీనియ‌ర్ల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా శ్రీస‌త్య‌సాయి జిల్లాలోని రాప్తాడులో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. పోలీసుల‌పై నోరు జారారు.. అనే క‌న్నా.. నోరు పారేసుకున్నార‌నే చెప్పాలి. పోలీసుల‌ను బ‌ట్ట‌లూడిదీసి కొడ‌తామని.. యూనిఫాం తీసేసి ప్ర‌శ్నిస్తామ‌ని.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై ఇత‌ర పార్టీలు ఎలా ఉన్నా.. పోలీసులు న్యాయ‌స్థానం ఆశ్ర‌యించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌రోవైపు.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో పార్టీలోని కొంద‌రు దూకుడు నాయ‌కులు రెచ్చిపోయే ప్ర‌మాదం త‌క్ష‌ణ‌మే క‌నిపించింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్‌ను కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేశారు. ఇప్ప‌టికే పార్టీపై ప్ర‌త్య‌ర్థి నేత‌లు.. `అరాచ‌క పార్టీ` అనే ముద్ర వేశారు. ఆ ప్ర‌భావం ఎన్నిక‌ల స‌మ‌యంలో స్ప‌స్టంగా క‌నిపించింది. ఇప్పుడు.. ఇది మ‌రింత పెరిగే అవ‌కాశం క‌నిపించింది. అంతేకాదు.. పార్టీలోని దూకుడు నేత‌ల‌కు జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ఆస‌రా క‌నిపిస్తున్నాయి. మా నాయ‌కుడే ఇంత దూకుడుగా ఉంటే..మేం త‌గ్గుతామా? అన్న‌ట్టుగా వారు రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంది. ఇదే జ‌రిగితే.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.