Begin typing your search above and press return to search.

గాలి కేసు తేలింది...జగన్ కేసు మిగిలింది !

ఈ కేసులో సీబేఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేసిన తరువాత కోర్టులో 14 ఏళ్ళ పాటు విచారణ జరిగి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.

By:  Tupaki Desk   |   6 May 2025 3:40 PM
CBI’s Focus on Jagan and Liquor Scams
X

ఇప్పటికి పదిహేనేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీలో సీబీఐ చేపట్టిన రెండు కేసులు పెను సంచలనం రేపాయి. అందులో ముందుగా గాలి జనార్ధనరెడ్డి కేసు తీసుకుంటే ఇది 2009 నుంచి 2011 మధ్యలో సీబీఐ విచారణ చేసిన కేసు. ఈ కేసులో సీబేఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేసిన తరువాత కోర్టులో 14 ఏళ్ళ పాటు విచారణ జరిగి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.

దాంతో గాలి జనార్ధనరెడ్డికి ఏడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇదిపుడు రాజకీయంగా కొంత సంచలనం రేపుతోంది. ఎందుకంటే ఈ కేసు తర్వాత 2012లో వైసీపీ అధినేత జగన్ మీద సీబీఐ కేసు ఫైల్ చేసింది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న దాని మీద పదకొండు చార్జి షీట్లు వేసి మరీ కేసు సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది.

ఇక ఈ కేసు మీద కూడా సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. గాలి కేసు ఒక కొలిక్కి వచ్చి తీర్పు వెలువరించిన తరుణంలో అందరి చూపూ జగన్ కేసు మీద ఉంది. ఈ కేసు కూడా తొందరగా విచారణ ముగిసి సీబీఐ తుది తీర్పు ఇస్తుందని అంతా భావిస్తున్నారు. గాలి కేసులో తీర్పుని చూసిన వారు అంతా జగన్ కేసులో ఏదైనా సంచలనం నమోదు అవుతుందా అని కూడా చర్చించుకుంటున్నారు.

నిజాకికి గాలి కేసు కంటే జగన్ కేసు మీదనే అందరి ఫోకస్ ఉంది. గాలి మాజీ మంత్రి మాత్రమే. ఆయన ప్రభావం కర్ణాటక రాజకీయాల్లో పెద్దగా లేదు. ఆయన సొంత పార్టీ స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసినా తాను మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్రమేంటి అంటే ఆయన బీజేపీలో చేరిపోయారు.

అయినా కూడా ఆయన ఇపుడు ఏడేళ్ళ జైలు శిక్షకు గురి అయ్యారు. బీజేపీలో చేరితే ఏదో విధంగా రక్షణ ఉంటుందని భావించిన వారందరికీ గాలి కేసు దిమ్మదిరిగే జవాబు అని అంటున్నారు. మరో వైపు చూస్తే అవినీతి అక్రమాలు ఎవరు చేసినా చట్టపరమైన రక్షణ ఉండదని కూడా కమలం పార్టీ ఈ విధంగా చాటుకున్నట్లు అయింది అని అంటున్నారు

మరో వైపు చూస్తే కనుక ఏపీలో జగన్ తన తండ్రి హయాంలో అక్రమాస్తులు కూడగట్టారని ఆయన పలుకుబడిని ఉపయోగించుకుని ఎంతో చేశారని సీబీఐ క్విడ్ ప్రోకో అభియోగంతో కేసు నమోదు చేసింది. దాంతో టెక్నికల్ గా ఈ కేసు ఎంతవరకూ నిలబడుతుంది అన్న చర్చ ఉన్నా అంతిమ లబ్దిదారు ఎవరు అన్నది చూస్తారు కాబట్టి బలంగానే ఉంటుందని అది ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఇక లిక్కర్ స్కాం విషయంలో ఏపీలో సీఐడీ దూకుడు చేస్తోంది. ఈ కేసులో మూల సూత్రధారులను పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో కూడా వైసీపీలో పెద్ద తలకాయలు చిక్కుతాయా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా వైసీపీ నేతలు వరసబెట్టి అరెస్టు అవుతున్నారు. వారి మీద కేసులు పడుతున్నాయి. తీగలు అన్నీ కలసి డొంక లాగితే ఏపీలో రాజకీయంగా ప్రకంపనలే పుడతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ లోగా గాలి కేసు ముందుకు రావడంతో అన్ని వైపుల నుంచి మేఘాలు ముసురుకుంటున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది.