Begin typing your search above and press return to search.

జగన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? వైసీపీలో ఒకటే చర్చ!

ఇన్నాళ్లు రాజధాని కూడా లేకుండా ప్రస్థానం కొనసాగిస్తున్న రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించేలా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది.

By:  Tupaki Desk   |   2 May 2025 3:20 PM
జగన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? వైసీపీలో ఒకటే చర్చ!
X

ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి పునః ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ దూరంగా ఉండిపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాజధాని విషయంలో వైసీపీ అధినేత మంచి అవకాశాన్ని చేజేతులారా కోల్పోయారా? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి కూటమి సర్కారు నుంచి ఆహ్వానం వెళ్లినా, జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు వెళ్లకపోవడం పొరపాటు చేసినట్లేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగానికి సబంధించిన ఈ కార్యక్రమానికి హాజరవ్వకూడదని నిర్ణయించుకున్న వైసీపీ అధినేత.. గురువారం రాత్రే తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లిపోవడం గమనార్హం.

ఇన్నాళ్లు రాజధాని కూడా లేకుండా ప్రస్థానం కొనసాగిస్తున్న రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించేలా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. దీన్ని జీర్ణించుకోలేకే మాజీ సీఎం జగన్ రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వెళ్లలేదని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, మూడు రాజధానులు పేరుతో అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రచారం చేశారు. ఐదేళ్ల పాలన కాలంలో శాశ్వత రాజధాని వివాదాన్ని కొలిక్కి తేలేకపోయారు. ఇక ఎన్నికల్లో ప్రజలు మూడు రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించినా, వైసీపీ ఇంకా అదే సిద్ధాంతం పట్టుకుని వేలాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాని మోదీ హాజరైన కార్యక్రమానికి విపక్ష పార్టీ అధినేతగా జగన్ హాజరైతే రాజధాని విషయంలో వైసీపీపై ఉన్న విమర్శలను అధిగమించేవారని అంటున్నారు. కానీ, జగన్ కార్యక్రమం జరిగే రోజు రాష్ట్రంలోనే లేకుండా వెళ్లిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను స్వయంగా హాజరు కాలేకపోయినా, తన పార్టీ నేతలను కార్యక్రమానికి పంపితే బాగుండేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ గైర్హాజరుతో రాజధాని విషయంలో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్లేనని అంటున్నారు.