జగన్ బెదిరింపులు లైట్ తీసుకున్నారే..!
ఇలా.. జగన్ తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్ భరోసా ఇస్తున్నారు.
By: Tupaki Desk | 26 May 2025 6:30 PMవైసీపీ అధినేత జగన్.. తరచుగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. అక్రమంగా జైళ్లకు పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇలా తమ వారిని వేధిస్తున్న వారికి 'జగన్ 2.0'లో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. తమ పార్టీ వారిని వేధిస్తున్నవారు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. చివరకు రిటైరైనా కూడా.. వెతికి మరీ తీసుకువ చ్చి సినిమా చూపిస్తామన్నారు.
ఇలా.. జగన్ తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్ భరోసా ఇస్తున్నారు. కేసులు పెడితే పెట్టించుకోవాలని.. కొడితే కొట్టించుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఎవరెవరు కేసులు పెట్టారో.. వారి పేర్లను రాసుకోవాలని అన్నారు.''రెడ్ బుక్ కాదు కానీ.. పేర్లు మాత్రం రాసుకోండి. అది ఏ పుస్తకమైనా ఫర్వాలేదు. పేర్లు మాత్రం రాసుకోండి. వారికి సినిమా.. మామూలుగా ఉండదు. ప్రతి కార్యకర్తకూ ఇదే చెబుతున్నా'' అని జగన్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ప్రజల మధ్య ఉండాలని కూడా పార్టీ నాయకులకు చెబుతున్నారు. అయితే.. అధికార పక్షంపై జగన్ చేస్తున్న బెదిరింపులను కూటమి పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అయితే.. అసలు ఈ వ్యాఖ్యలను కూడా వినిపించుకోవడం లేదు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే.. నవ్వి ఊరు కుంటున్నారు. పోనీ.. వైసీపీ నాయకులు ఏమైనా స్పందిస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. వారు కూడా జగన్ చెబుతున్న విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా? అనే చర్చ సాగుతోంది.
నిజానికి జగన్ చెప్పినట్టు.. లేదా కూటమి ని బెదిరించినట్టు.. కనుక పార్టీ కార్యకర్తలు, నాయకులు విశ్వసిస్తే .. ఖచ్చితంగా వారు బయటకు వచ్చి ఉండేవారు. కానీ, అలాంటి పరిణామం ఎక్కడా కనిపించడం లేదు. పైగా నాయకులు ఎలా ఉన్నా.. కార్యకర్తలు మౌనంగా ఉంటున్నారు. ఎవరూ బయటకు కూడా రావడం లేదు. అంటే.. జగన్ చేసిన హెచ్చరికలు అటు కూటమి ఎలా నూ పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీలోనూ నాయకులు, కార్యకర్తలు కూడా లైట్ తీసుకుంటున్నారా? అనేది ఆసక్తిగా మారింది.