Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ...ఏపీ-టీ బోర్డర్ లో హై టెన్షన్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్తైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2023 6:13 AM GMT
ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ...ఏపీ-టీ బోర్డర్ లో హై టెన్షన్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్తైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో కంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు బలంగా చేశారనే కామెంట్లు వినిపించాయి.

మరోవైపు హైదరబాద్ రింగ్ రోడ్డుమీదా, కేబీఆర్ పార్కుల్లోనూ కాదు.. ఏపీలో సొంత ఊర్లకు వెళ్లి అక్కడ దీక్షలు చేయండి, నిరసనలు తెలపండని బండ్ల గణేష్ పిలుపు ఇచ్చారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగులు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. దీంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు.

అవును... స్కిల్ స్కాం లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రిగా ర్యాలీగా బయలుదేరారు. ఛలో రాజమండ్రి అంటూ భారీ సంఖ్యలో వాహనాలు హైవే ఎక్కాయి. దీంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా పోలీసులు బోర్డర్ దగ్గరకి చేరుకున్నారు. ఆ ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. దీంతో ఏపీ తెలంగాణ బోర్డర్ లో హై టెన్షన్ నెలకొంది.

ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్ పరిధిలో పూర్తి భద్రత ఏర్పాట్లు ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు లోపల ఉండటంతోపాటు ప్రస్తుతం సీఐడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సున్నితమైన ప్రాంతంగా భావించిన పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో.. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు.

ఇందులో భాగంగా... 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీసు కమిషనర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏపీ - తెలంగాణ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తమై జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఏపీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఇదే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ర్యాలీని ఏపీలోకి ఎంటరవ్వనివ్వమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో... ఏపీలోకి ఎంటరవుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్ర సరిహద్దులలో టెన్షన్ చోటు చేసుకుంది.

మరోపక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండో రోజు సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. దీంతో భారీ కార్ల ర్యాలీ నిర్వహించాలని ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు!