Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ తాజా నిర్ణయంతో ఐటీ ఉద్యోగులకు పండుగే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పాలనలో తన ముద్ర కొట్టొచ్చినట్లుగా చూపించాలని తపిస్తున్నారు

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:37 AM GMT
సీఎం రేవంత్ తాజా నిర్ణయంతో ఐటీ ఉద్యోగులకు పండుగే
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పాలనలో తన ముద్ర కొట్టొచ్చినట్లుగా చూపించాలని తపిస్తున్నారు. తన ప్రభుత్వ ప్రాధామ్యాయాల జాబితాను సిద్ధం చేసుకున్న ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన దశాబ్దాలుగా వేధిస్తున్న ప్రజారవాణా సమస్యకు పరిష్కారం చూపేందుకు ఆయన భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం పట్టించుకోని అంశాలకు భారీ ప్రాధాన్యతను ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

గత ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని మెట్రో రూట్లన నిలిపి వేస్తూ.. అదే సమయంలో సరికొత్త ప్రతిపాదనలతో కొంగొత్త మెట్రో ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. 5 మార్గాల్లో 76 కి.మీ. మేర మెట్రో విస్తరణ తన ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన స్పష్టం చేశారు. తాజాగా చేసిన ప్రతిపాదనలోకీలకమైన ఒక నిర్ణయం సిటీ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులకు పండుగ లాంటి వార్తగా చెప్పాలి.

ఇప్పటివరకు ఐటీ కారిడార్ లో రాయదుర్గ వరకు మాత్రమే మెట్రోరైలు వసతి ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఐటీ కారిడార్ కోర్ గా చెప్పే నానక్ రాం గూడ వరకు విస్తరించే ప్లాన్ ను తాజాగా రివీల్ చేశారు. రాయ్ దుర్గ్ నుంచి గచ్చిబౌలి.. విప్రో జంక్షన్.. అమెరికాన్ కాన్సులేట్ తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మొత్తం 12 కి.మీ. మేర మెట్రోను నిర్మించాలని డిసైడ్ అయ్యారు.

ఇప్పటివరకు నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్ కు వచ్చి ఉద్యోగాలు చేసే లక్షలాది మంది సొంత వాహనాల్లోనే వచ్చే పరిస్థితి. దీనికి కారణం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి తమ ఆఫీసులకు వెళ్లాలంటే కనిష్ఠంగా నాలుగు కి.మీ. గరిష్ఠంగా పదిహేను కి.మీ. వరకు ప్రయాణించాల్సిన పరిస్థితి. అలాంటి వాటికి చెక్ చెప్పేలా తాజా ప్లానింగ్ ఉంది. కొత్తగా ప్రిపేర్ చేసిన 12 కి.మీ. (ఐటీ కారిడార్ లో) మెట్రో పుణ్యమా అని.. ఆఫీసులకు సంబంధించి మహా అయితే ఒకట్రెండు కి.మీ. కంటే తక్కువ దూరానికి చేరుకునే సౌకర్యం లభిస్తుంది.

ఇప్పుడున్న మెట్రోలోనూ అత్యధిక ప్రయాణికులు ప్రయాణిస్తున్న మార్గంగా ఐటీకారిడార్ లైన్ నిలుస్తుంది. అలాంటి మార్గాన్ని కొనసాగింపుగా మరింత విస్తరించటం ద్వారా.. నగరంలోని లక్షలాది ఐటీ ఉద్యోగులకు మేలుకలిగేలా చేస్తుంది. మరోవైపు బెంగళూరు జాతీయరహదారికి సంబంధించి నగరానికి రావాలంటే చాలా ఇబ్బందులుపడుతున్న పరిస్థితి. అలాంటివాటికి చెక్ పెట్టేలా తాజా మెట్రో ప్లానింగ్ ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

నిత్ంయ ఆరాంఘర్ వద్ద వేలాది మంది ప్రయాణిస్తుంటారు. వందలాది బస్సులు ఆ వైపు వెళుతుంటాయి.దీంతో.. అక్కడి రోడ్డు మీద తీవ్రమైన ట్రాఫిక్ ఉంటుంది. ఆ ప్రాంతానికి మెట్రో అనుసంధానం లేకపోవటంతో సిటీలోకి రావటానికి చాలాసేపు సమయం తీసుకోవటంతో పాటు ఖర్చుతో కూడుకున్న పరిస్థితి.

దీనికి పరిష్కారంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్.. ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్.. అక్కడి నుంచి ఆరాంఘర్ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశిచంారు. ఈ రూట్ మొత్తం 19కి.మీ. ఉండనుంది. ఈ మార్గం కొత్త హైకోర్టు నిర్మించే ప్రాంతాన్ని కూడా కలిపేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. నగర ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పాలి.