'ఐఎన్ఎస్ విక్రాంత్' కోసం పీఎంవో స్టాఫ్ అని ఫోన్... ముజీబ్ అరెస్ట్!
అయితే.. అతడు 2021 నుంచి మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఆదివారం రాత్రి అతడిని కోజికోడ్ లోని ఎలాతూర్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 13 May 2025 1:30 AMతాము ఇండియన్ డిఫెన్స్ అధికారులమని పేర్కొంటూ జర్నలిస్టులకు ఫోన్ చేసి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి అధికారులు చేసే బ్రీఫింగ్, పాక్ విషయంలో చేసే ప్రణాళికలు మొదలైన సమాచారాన్ని సేకరిస్తున్నారని భారత నిఘా వర్గాలు తాజాగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాను పీఎంవో ఉద్యోగినంటూ ఫోన్ చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఆరా తీశాడో వ్యక్తి!
అవును.. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. శనివారం సాయంత్రం వాటిని ఆపారు. ఇలా కాల్పుల విరమన అయితే ఆగింది కానీ.. పాక్ గూఢచారుల ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో కొచ్చి నావల్ బేస్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఆరా తీశాడు. పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాళ్లోకి వెళ్తే... కొచ్చి నావల్ బేస్ కు అనుమాస్పద కాల్ ఒకటి వచ్చింది. ఇందులో భాగంగా.. కోజికోడ్ లోని ఎలాతూర్ కు చెందిన ముజీబ్ రెహమాన్ (32) అనే వ్యక్తి ఫోన్ చేసి ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ ఎక్కడుందో చెప్పాలని.. తాను ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో.. కొచ్చిలోని హార్బర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య... భారత నౌకాదళంలో సేవలందిస్తున్న విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ స్థానాన్ని తెలుసుకోవాలని ముజీబ్ అనే వ్యక్తి.. నావల్ బేస్ కు చేసిన కాల్ పై నమోదు చేయబడిన కేసుపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
అయితే.. అతడు 2021 నుంచి మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఆదివారం రాత్రి అతడిని కోజికోడ్ లోని ఎలాతూర్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడు శుక్రవారం ఉదయం 9:15 గంటలకు కొచ్చి నావికా స్థావరం దగ్గర్లోకి వచ్చి అక్కడ నుంచి అధికారిక నంబర్ కు కాల్ చేసినట్లు చెబుతున్నారు.
ఆ సమయంలో తనను తాను ప్రధానమంత్రి కార్యాలయం ఉద్యోగి రాఘవన్ అని పరిచయం చేసుకున్నాడు. ఈ సమయంలో నేవీ అధికారుల ఫిర్యాదు ఆధారంగా.. బీ.ఎన్.ఎస్. సెక్షన్ 319(2) కింద కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.