Begin typing your search above and press return to search.

భారత నేవీ దెబ్బకు పాక్ నాలుగు ముక్కలు... రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!

అవును... ఆపరేషన్ సింధూర్ లో కీలక భూమిక పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు.

By:  Tupaki Desk   |   30 May 2025 10:03 AM
భారత నేవీ దెబ్బకు పాక్  నాలుగు ముక్కలు... రాజ్  నాథ్  సింగ్  కీలక వ్యాఖ్యలు!
X

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం అరేబియా సముద్రంలో మొహరించిన భారతదేశంలోని మొట్టమొదటి స్వదేశీ తయారీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆపరేషన్ సిందూర్, అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ పాత్ర, పాక్ కష్టాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆపరేషన్ సింధూర్ లో కీలక భూమిక పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ లో నేవీ పాత్రను ప్రశంసించారు. భారతదేశపు సాటిలేని సముద్ర డొమైన్ అవగాహన, సముద్ర ఆధిపత్యం కలిసి.. పాకిస్థాన్ నేవీని దాని సొంత తీరాలకే పరిమితం చేసిందని అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మన దాడి ఏస్థాయిలో ఉందంటే.. భారత్ ను ఆపాలంటూ పాకిస్థాన్ ప్రపంచదేశాలను వేడుకుందని.. అయితే మన నిబంధనల ప్రకారమే సైనిక చర్యను ఆపేశామని.. ఆపరేషన్ సమయంలో నేవీ పాత్ర అద్భుతమైనదని తెలిపారు.

ఓ పక్క పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను వైమానిక దళం నేలమట్టం చేస్తే.. మన నావికాదళం సముద్రంలో చూపిన సంసిద్ధత పాక్ నావికాదళాన్ని ఎక్కడికీ కదలనీయకుండా నిలువరించిందని అన్నారు. ఇండియన్ నేవీ ముందస్తు మొహరింపుతో పాక్ ధైర్యంపై దెబ్బకొట్టారని తెలిపారు. ఇండియన్ నేవీ సన్నద్ధతే దాయాదీకి గట్టి హెచ్చరిక అని తెలిపారు.

ఈ సందర్భంగా 1971లో భారత నేవీ పాకిస్థాన్ రెండుగా విభజించిందని.. ఆపరేషన్ సిందూర్ లో నేవీ తన పూర్తి బలాన్ని ప్రదర్శించి ఉంటే ఈసారి పాక్ నాలుగు భాగాలుగా విడిపోయేదని చెప్పిన రాజ్ నాథ్... ఇప్పటివరకూ జరిగిన ఆపరేషన్ సిందూర్.. వార్మ్ అప్ మాత్రమే అని పాక్ ను హెచ్చరించారు. ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగితే పాక్ పరిస్థితి దేవుడికే తెలుసని అన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి తెలుసా?:

ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2022లో కమిషన్ వేసిన ఐఎన్ఎస్ విక్రాంత్.. పెరుగుతున్న భారత సముద్ర బలానికి చిహ్నంగా నిలుస్తుంది. సుమారు 45,000 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీన్ని భారత నావికాదళ యుద్ధనౌక డిజైన్ బ్యూరో, కొచ్చిన్ షిప్ యార్ట్ లిమిటెడ్ నిర్మించాయి.

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉత్తర అరేబియా సముద్రంలో 8 నుంచి 10 యుద్ధనౌకలతో కూడిన యుద్ధ బృందం ఉనికి, డిస్ట్రాయర్లు, స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ లు.. పాకిస్థాన్ కాల్పుల నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. పాక్ నావికా దళాలు కరాచీ నావికా స్థావరంలో డాక్ చేయడంలో ఐఎన్ఎస్ పాత్రే కీలకం!

దీనిపై బ్రహ్మోస్ క్షిపణులు, మీడియం రేజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు, వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలతో కూడిన ఏడు డిస్ట్రాయర్లు ఈ మొహరింపులో ఉన్నాయని.. ఇవి ఉపరితమ, వైమానిక, నీటి అడుగు ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నాయని నేవీ వర్గాలు చెబుతున్నాయి!