Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్‌ ఇండియాస్‌ రిచెస్ట్‌ జాబితాలో ఐదుగురు తెలుగు వాళ్లు!

అవును... భారత్ లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:53 AM GMT
ఫోర్బ్స్‌ ఇండియాస్‌ రిచెస్ట్‌ జాబితాలో ఐదుగురు తెలుగు వాళ్లు!
X

"ఫోర్బ్స్‌ ఇండియాస్‌ 100 రిచెస్ట్‌ జాబితా-2023" తాజాగా విడుదలయ్యింది. ఇందులో భాగంగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నులని ఫోర్బ్స్‌ ప్రకటించింది. ఇక, గౌతమ్‌ అదానీ రెండో ప్లేస్ లో నిలవగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ రెండు స్థానాలు మెరుగుపరచుకుని మూడో ర్యాంకు దక్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఐదుగురు ఉండటం గమనార్హం.

అవును... భారత్ లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నులని ప్రకటించింది. 92 బిలియన్‌ డాలర్ల సంపదతో ముకేశ్‌ నంబర్‌-1గా నిలిచారని తెలిపింది. అనంతరం... 68 బిలియన్ డాలర్లతో గౌతమ్‌ అదానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.

ఇదే సమయంలో రెండు స్థానాలు మెరుగుపరచుకుని జాబితాలో మూడో ర్యాంకు దక్కించుకున్నారు హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌. హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు గత ఏడాది కాలంలో 42 శాతం దూసుకెళ్లడంతో అయన రెండు ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. ఓపీ జిందాల్‌ గ్రూప్‌ నకు చెందిన సావిత్రి జిందాల్‌ 24 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 23 బిలియన్ డాలర్లతో దమానీ 5వ స్థానంలో నిలిచారు.

ఇదే క్రమంలో ఈ 100 మంది భారతీయ సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు స్థానం దక్కించుకున్నారు. ఇందులో 6.3 బిలియన్ డాలర్లు (రూ.52,409.70 కోట్ల)తో దివీస్‌ లేబొరేటరీస్‌ అధిపతి దివి మురళి 33వ ర్యాంకులో నిలిచారు. ఆ తర్వాత 4.05 బిలియన్ డాలర్లు (రూ.33,691.95 కోట్ల)తో మేఘా ఇంజినీరింగ్ కు చెందిన పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 54వ స్థానంలో నిలిచారు.

ఇక 3 బిలియన్ డాలర్ల (రూ.24,957 కోట్లత్)తో డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ సతీష్ రెడ్డి & ఫ్యామిలీ 75వ ర్యాంకులో నిలిచారు. అనంతరం... 2.48 బిలియన్ డాలర్ల (రూ.20,631.12 కోట్ల)తో అపోలో హాస్పటల్స్ ప్రతాప్ రెడ్డి 94వ ర్యాంకు సంపాదించుకోగా... 2.35 బిలియన్ డాలర్ల (రూ.19,549.65 కోట్ల)తో అరబిందో ఫార్మా పీవీ రాం ప్రసాద్ రెడ్డి 98వ ర్యాంకులో నిలిచారు.

కాగా... టాప్‌-100 జాబితాలో చేరేందుకు కనీస అర్హత సంపద 2.3 బిలియన్‌ డాలర్లుగా ఉండగా... ఈ ఏడాది, రేణుకా జాగ్తియానీ (లాండ్‌ మార్క్‌ గ్రూప్‌ ఛైర్‌ పర్సన్‌), డానీ కుటుంబం (ఏషియన్‌ పెయింట్స్‌), కె.పి.రామస్వామి (కేపీఆర్‌ మిల్‌) కొత్తగా ఈ జాబితాలో చేరినవారిలో ఉన్నారు.