Begin typing your search above and press return to search.

నో అబ్రాడ్.. భారతీయ విద్యార్థులకు విదేశాల్లో డోర్ల్ క్లోజ్

ఇక యూకే విషయానికి వస్తే, ఆ దేశం విదేశీ విద్యార్థులు వారిపై ఆధారపడిన వారిని తీసుకురాకుండా నిబంధనలు విధించింది.

By:  Tupaki Desk   |   16 April 2025 6:05 PM
నో అబ్రాడ్.. భారతీయ విద్యార్థులకు విదేశాల్లో డోర్ల్ క్లోజ్
X

‘దూరపు కొండలు నులుపు’ అంటారు. అగ్రరాజ్యాలు అనగానే ఎగేసుకుంటూ లక్షలు ఖర్చు పెట్టి భారతీయ విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఆ దేశాల్లో బాగా చదువుకొని అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను స్థానికులకు దూరం చేస్తున్నారన్న వాదన అక్కడి ప్రభుత్వాల్లో ఉంది. అందుకే ట్రంప్ సహా ఆ దేశాధినేతలు ఇప్పుడు విదేశీ విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తరిమేస్తున్నారు. ఇది అంతిమంగా భారతీయ విద్యార్థుల్లో మార్పునకు కారణం అవుతోంది. పరిగెత్తి పాలు తాగేకన్నా.. నిలబడి నీళ్లు తాగడం మేలు అని భావిస్తూ అందరూ విదేశాల కంటే ఇండియా ముద్దు అన్నట్టుగా దేశంలోనే చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

గత ఐదు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా, 2024లో విదేశీ విద్యకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే వంటి ప్రధాన గమ్యస్థానాలలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. విశ్లేషకులు ఈ తగ్గుదలకు వీసా తిరస్కరణలు ఒక ముఖ్య కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ మూడు దేశాల నుండి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాలలో దాదాపు 25 శాతం క్షీణత నమోదైంది.

-ఏ దేశానికి ఎంత తగ్గుదల?

అమెరికా: అమెరికా కూడా భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీ తగ్గుదలను చవిచూసింది. 2024లో ఎఫ్‌1 వీసాల జారీ 34 శాతం పడిపోయింది. అంతకు ముందు సంవత్సరం 1,31,000 వీసాలు జారీ చేయగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 86,000కు పరిమితమైంది.

కెనడా: భారతీయ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానాలలో కెనడా ఒకటి. అయితే, 2024లో కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 32 శాతం తగ్గిపోయింది. ఇది 2.78 లక్షల నుండి 1.89 లక్షలకు చేరిందని కెనడా యొక్క ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా సంస్థ స్వయంగా వెల్లడించింది.

యూకే: యూకే కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 26 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 1,20,000 విద్యార్థి వీసాలు జారీ చేయగా, తాజా యూకే హోమ్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2024లో ఈ సంఖ్య 88,732కు పడిపోయింది.

-తగ్గుదలకు కారణాలు ఏమిటి?

ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా కెనడా , యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కెనడా అయితే ఏకంగా భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 32 శాతం తగ్గించింది. అదే సమయంలో చైనా విద్యార్థులకు కేవలం 3 శాతం మాత్రమే తగ్గించడం గమనార్హం.

కెనడా ఈ చర్యకు గల కారణాలను కూడా వెల్లడించింది. తమ దేశంలో తాత్కాలికంగా నివసించే విదేశీయుల సంఖ్యను 2026 నాటికి 5 శాతానికి తగ్గించాలని ఆ దేశం నిర్ణయించింది. విదేశీ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం వలన గృహ, ఆరోగ్య , ఇతర ప్రజాసేవలకు భారం పెరుగుతోందని కెనడా వాదిస్తోంది. అంతేకాకుండా, కెనడా వర్సెస్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోశాయి. ఆ దేశంలో భారతీయ విద్యార్థులపై కొన్ని ఆంక్షలు విధించడం కూడా దీనికి కారణం.

ఇక యూకే విషయానికి వస్తే, ఆ దేశం విదేశీ విద్యార్థులు వారిపై ఆధారపడిన వారిని తీసుకురాకుండా నిబంధనలు విధించింది. ఈ కారణంగా కూడా వీసా కోసం దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గింది. వాస్తవానికి, కోవిడ్ మహమ్మారి తర్వాత 2023 నుండే యూకే భారతీయులకు విద్యార్థి వీసాలు ఇవ్వడం తగ్గించింది. ఆ సంవత్సరం 13 శాతం తగ్గుదల కనిపించగా, 2024లో అది 26 శాతానికి చేరుకుంది.

- గతంలో భారీగా పెరుగుదల

గత పదేళ్లలో ఈ మూడు దేశాలలో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. ఒకానొక సమయంలో భారతీయ విద్యార్థులు చైనా విద్యార్థులను కూడా అధిగమించారు. 2015 నుండి 2023 మధ్య కాలంలో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 31,920 నుండి 2,78,160కి చేరుకుంది. ఇదే సమయంలో యూకేకు వెళ్లే వారి సంఖ్య 10,418 నుండి 1,19,738కి పెరిగింది. అమెరికాకు 2015లో 74,831 మంది ఎఫ్‌1 వీసాపై వెళ్లగా, 2023లో ఆ సంఖ్య 1,30,730గా నమోదైంది.

మొత్తానికి, ఐదేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ విద్యకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కెనడా , యూకేల యొక్క కఠినమైన వీసా విధానాలు, భారత్-కెనడా మధ్య సంబంధాలలో నెలకొన్న ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.