ట్రాఫిక్ క్రమశిక్షణలో వెనుకబడిన భారత్.. ఏటా రూ. 12 వేల కోట్ల ఫైన్లు!
భారతదేశంలో మొత్తం 140 కోట్ల జనాభా ఉంటే, వారిలో కేవలం 11 కోట్ల మంది మాత్రమే వాహనాలు కలిగి ఉన్నారు.
By: Tupaki Desk | 20 May 2025 10:00 PM ISTభారతదేశంలో వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఈ నిర్లక్ష్యానికి అద్దం పడుతూ ఏటా భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కేవలం 2024 లోనే దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా ట్రాఫిక్ చలాన్లు జారీ అయ్యాయని, దీని విలువ రూ.12 వేల కోట్లకు పైగా ఉంటుందని ఒక ఆటోమొబైల్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది చిన్న రాష్ట్రాల మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎక్కువ కావడం ఆందోళన కలిగించే విషయం.
ప్రతి రెండు వాహనాల్లో ఒక దానికి ఫైన్
భారతదేశంలో మొత్తం 140 కోట్ల జనాభా ఉంటే, వారిలో కేవలం 11 కోట్ల మంది మాత్రమే వాహనాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ, ప్రతి రెండవ వాహనానికి కనీసం ఒక్కసారైనా జరిమానా విధించడం జరిగింది. అంటే, మన దేశంలో ట్రాఫిక్ క్రమశిక్షణ ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నియమాలను పాటించాల్సిన అవసరం లేదన్న నిర్లక్ష్యపు మనస్తత్వం ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది.
పోలీసులు ఉంటేనే నియమాలు పాటిస్తారా?
ఈ సర్వేలో వెల్లడైన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 43.9శాతం మంది డ్రైవర్లు పోలీసులు ఉన్నా లేకపోయినా తాము ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నామని చెప్పారు. అయితే, 31.2శాతం మంది మాత్రం సమీపంలో పోలీసులు ఉన్నారని అనుమానించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నారు. ఇక, 17.6శాతం మంది జరిమానాలను తప్పించుకోవడానికి తమ పరిసరాలకు తగ్గట్లుగా డ్రైవింగ్ చేస్తున్నారని తేలింది. చాలా మంది భారతీయ డ్రైవర్లు, పోలీసు కనిపించకపోతే ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.
డ్రైవర్లు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులను గుర్తించినప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఎలా పాటిస్తారో కూడా ఈ సర్వేలో వెల్లడైంది. సగానికి పైగా (51.3శాతం) వాహనదారులు తమ వాహన వేగాన్ని తగ్గించుకుని, నియమాలను పాటిస్తున్నారు. మరో 34.6శాతం మంది ఎటువంటి చట్టాలను ఉల్లంఘించరు. కానీ పోలీసుల్ని చూసి నెమ్మదిగా వెళ్తారు. ఇక, 12.9శాతం మంది తమ డ్రైవింగ్ శైలిని మార్చుకోవడం, పట్టుబడకుండా ఉండటానికి వేరే దారిలో వెళ్లడం వంటివి చేస్తారు.
కెమెరాలు ఉన్నప్పుడే రూల్స్
నిఘా కెమెరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రిస్తాయని భావించినప్పటికీ, సర్వేలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 47 శాతం మంది కెమెరా ఉనికితో సంబంధం లేకుండా తాము స్థిరంగా డ్రైవ్ చేస్తున్నామని చెప్పారు. 36.8 శాతం మంది కెమెరాను చూసినప్పుడు మాత్రమే నెమ్మదిస్తారని తెలిపారు. ఆసక్తికరంగా, 15.3 శాతం మంది స్పీడ్ కెమెరాలకు మాత్రమే భయపడుతున్నారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనల వల్ల సంభవించే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే.. 2022 లో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు.
రూ. 9,000 కోట్ల జరిమానాలు వసూలు కానివే
రూ.12 వేల కోట్ల జరిమానాలు సాంకేతికంగా విధించినప్పటికీ.. వాటిలో చాలా వరకు వసూలు కావడం లేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంలో ఎంత పకడ్బందీగా ఉన్నారో, ఈ జరిమానాలను చెల్లించడంలోనూ అంతే నేర్పుగా తప్పించుకుంటున్నారు. దాదాపు రూ. 9,000 కోట్ల విలువైన జరిమానాలు చెల్లించడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వాహనదారులు జరిమానాలను చెల్లిస్తున్నారు. ఇది ట్రాఫిక్ క్రమశిక్షణను అమలు చేయడంలో ఉన్న లోపాలను స్పష్టం చేస్తోంది.
