Begin typing your search above and press return to search.

50 డ్రోన్లు, 8 మిస్సైళ్లు, 3 ఫైటర్ జెట్లు... పాక్ కు గ్యాప్ ఇవ్వని భారత్!

గురువారం జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

By:  Tupaki Desk   |   9 May 2025 9:31 AM IST
50 డ్రోన్లు, 8 మిస్సైళ్లు, 3 ఫైటర్  జెట్లు... పాక్  కు గ్యాప్  ఇవ్వని భారత్!
X

గురువారం జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సమయంలో భారత్ పై దాడులకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణును, ఫైటర్ జెట్లను పంపింది. అయితే.. వాటన్నింటికీ భారత్ షాకిచ్చింది.

అవును... భారత్ పై దాడులు చేయాలని డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లను పాక్ పెద్ద ఎత్తున ప్రయోగించింది. అయితే పాక్ ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇందులో భాగంగా... సీ-400 రక్షణ వ్యవస్థలు, ఎల్-70 గన్స్, జెడ్.యూ-23ఎంఎం, చిల్కా సిస్టమ్స్ టెక్నాలజీతో.. పాక్ డ్రోన్ లను, క్షిపణులను అడ్డుకున్నాయి. అన్నింటినీ గాల్లోనే తుక్కు తుక్కు చేశాయి.

ఈ సందర్భంగా స్పందించిన ఇండియన్ ఆర్మీ.. పాకిస్థాన్ సాయుధ దళాలు 2025 మే 08 - 09 తేదీల మధ్య పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామాగ్రిని ఉపయోగించి అనేక దాడులు ప్రారంభించిందని.. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ (ఎల్.ఓ.సీ) వెంబడి పాకిస్థాన్ దళాలు అనేక కాల్పుల విరమణ ఉల్లంఘనల (సీ.ఎఫ్.వీ) కు పాల్పడ్డాయని తెలిపింది.

అయితే.. డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, కాల్పుల విరమణ ఉల్లంఘనలను సమర్థవంతంగా సమాధానం ఇవ్వబడిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందని.. అన్ని దుర్మార్గపు కుట్రలకు బలవంతంగా ప్రతిస్పందిస్తుందని ఎక్స్ వేదికగా తెలిపింది.

ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి పాకిస్థాన్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్ లను పంపడానికి విఫలయత్నం చేసిన పాక్.. జమ్మూ, ఉధంపూర్, సాంబా, నగ్రోటా, పఠాన్ కోఠ్ ప్రాంతాల్లో భారత ఆర్మీ వైమానిక రక్షణ దళాలు కౌంటర్ డ్రోన్ ఆపరేషన్ నిర్వహించాయని.. ఈ ఆపరేషన్ లో 50కి పైగా డ్రోన్ లను సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

ఇదే సమయంలో... సత్వారీ, సాంబా, ఆ.ఎస్.పురా, అర్నియా సెక్టార్ లలో పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను భారత్ నేలకూల్చింది! అదేవిధంగా... మూడు ఫైటర్ జెట్లను భారత్ నేలమట్టం చేసింది! ఇందులో భాగంగా... ఒక ఎఫ్-16 ఫైటర్ జెట్ ను, రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చేసినట్లు తెలుస్తోంది. లాహోర్ సహా 7 చోట్ల గగనతల రక్షణ దళాలను భారత్ ధ్వంసం చేసినట్లు సమాచారం!