Begin typing your search above and press return to search.

మేడిన్ భారత్ భార్గవాస్త్రం ఎఫెక్టు ఎంత ఎక్కువంటే?

తాజాగా భార్గవాస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఆధునిక యుద్ధంలో డ్రోన్ల రూపంలో ఎదురయ్యే ముప్పును ఈ సరికొత్త అస్త్రం సమర్థంగా ఢీ కొంటుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   15 May 2025 6:30 AM
మేడిన్ భారత్ భార్గవాస్త్రం ఎఫెక్టు ఎంత ఎక్కువంటే?
X

భారత అమ్ములపొదిలో మరో దివ్యాయుధంగా భార్గవాస్త్రం మారనుందా? అంటే అవునని చెబుతున్నారు. ప్రత్యర్థి దేశాల డ్రోన్లు.. మానవ రహిత గగనతల వాహనాల్ని టార్గెట్ చేసి.. వాటిని ఇట్టే కూల్చేసే శక్తి ఈ స్వదేశీ కౌంటర్ డ్రోన్ స్టిస్టం సొంతంగా చెబుతున్నారు. తాజాగా భార్గవాస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఆధునిక యుద్ధంలో డ్రోన్ల రూపంలో ఎదురయ్యే ముప్పును ఈ సరికొత్త అస్త్రం సమర్థంగా ఢీ కొంటుందని చెబుతున్నారు. తాజాగా జరిపిన ప్రయోగాల్లో టార్గెట్లను పక్కాగా చేధించిన వైనం ఆసక్తికరంగా మారింది. నిర్దేశించిన లక్ష్యాల్ని తూచా తప్పకుండా చేరుకున్నట్లుగా చెబుతున్నారు.

మంగళవారం ఒడిశా రాష్ట్రంలోని గోపాల్ పూర్ లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారుల సమక్షంలో వీటిని పరీక్షించారు. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ లిమిటెడ్ (ఎస్ డీఎల్) డెవలప్ చేసిన ఈ స్వదేశీ డ్రోన్లు అద్వితీయ ప్రతిభను ప్రదర్శించాయి. మొత్తం మూడు ట్రయల్స్ ను నిర్వహించగా.. ఈ మూడూ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదని.. భార్గవాస్త్రలోని నాలుగు మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాల్ని చేధించినట్లు చెబుతున్నారు.

పరీక్షల్లో భాగంగా తొలుత రెండు రెండు రాకెట్లను వేర్వేరుగా ఫైర్ చేశారు. దీంతో రెండు ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడో ట్రయల్ లో భాగంగా మరో రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్ లో కేవలం రెండు సెకన్ల వ్యవధిలో పరీక్షించగా.. ఆ పరీక్ష కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. నాలుగు రాకెట్ల పని తీరు అద్భుతంగా ఉందని చెబుతున్నారు. నిర్దేశిత లాంచ్ పారా మీటర్లను ఈ నాలుగు రాకెట్లు సాధించినట్లుగా చెబుతున్నారు. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురి పెట్టి కచ్ఛితంగా నేలకూల్చే సాంకేతికతను భారత్ సొంతం చేసుకుందని చెప్పాలి.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భార్గవాస్త్రలోని దశలు.. వాటి ప్రత్యేకతల్ని చూస్తే..

మొదటి దశ

ఆన్ గైడెడ్ మైక్రో రాకెట్లు.. శత్రు దేశాల డ్రోన్లను ఇట్టే కూల్చేస్తాయి.

రెండో దశ

గైడెడ్ మైక్రో మిస్సైల్ ఉంటుంది. ఇది పిన్ పాయింట్ కచ్ఛితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తు చేస్తుంది. శత్రు డ్రోన్లు తప్పించుకునే ఛాన్సే ఉండదు. గైడెడ్ మైక్రో మిస్సైల్ ను గతంలోనే పరీక్షించారు.

భార్గవాస్త్ర ప్రత్యేకతల కుప్పగా చెప్పాలి. దీన్ని డెవలప్ చేయటం ఒక ఎత్తు అయితే.. అందుకు చేసిన ఖర్చు చాలా పరిమితమని.. చౌక లో వీటిని రూపొందించేలా చేయటం ఒక ప్రత్యేకతగా చెబుతున్నారు. భార్గవాస్త్ర ప్రత్యేకతల్ని చూస్తే..

- అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పని చేసేలా డెవలప్ చేవారు.

- సముద్ర మట్టానికి 5 కిలోమీటర్లకు పైగా ఎత్తులోనూ చక్కగా పని చేయగలదు.

- భారత సైనిక దళాల అవసరాలకు అనుగుణంగా డెవలప్ చేశారు.

- పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో.. తక్కువ ఖర్చుతో దీన్ని డిజైన్ చేయటం విశేషం.

- త్రివిధ దళాల అవసరాల మేరకు ఇందులో అదనంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.

- భార్గవాస్త్ర కమాండ్.. కంట్రోల్.. కమ్యూనికేషన్స్.. కంప్యూటర్స్ ఇంటెలిజెన్స్ (అడ్వాన్స్ డ్ సీ4ఐ) సాంకేతికతతో పని చేస్తుంది.

- గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్ టైంలో ఎప్పటికప్పుడు గుర్తించే వీలుంది.

- భార్గవాస్త్రలోని రాడార్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్లు లో రాడార్ క్రా సెక్షన్ లక్ష్యాల్ని సైతం గుర్తించే సత్తా ఉంది.

- కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.

- నిజానికి భార్గవాస్త్ర తరహాలో మైక్రో మిస్సైల్ సిస్టమ్స్ ను రూపొందించినప్పటికీ.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో.. తక్కువ ఖర్చుతో బహుళ దశలతో కూడిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదు.

- భార్గవాస్త్రను హార్డ్ కిల్ మోడ్ లో తయారు చేశారు. దీంతో భారీ డ్రోన్లతో పాటు చాలా చిన్నస్థాయి డ్రోన్లను కూడా గుర్తించి మట్టుపెట్టే సత్తా దీని సొంతం.