కావాలంటే టెరిటోరియల్ ఆర్మీనీ తీసుకోండి.. ఆర్మీ చీఫ్కు స్పెషల్ పవర్స్
భారత్ ప్రయోగిస్తున్న ఒక్కో ఆయుధం పాక్ కు కోలుకోలేని దెబ్బనే మిగులుస్తున్నాయి.
By: Tupaki Desk | 9 May 2025 3:16 PM ISTపాకిస్థాన్ ను మళ్లీ లేవకుండా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో ఉన్న భారత్.. అందుకు కావాల్సిన అన్ని చర్యలనూ తీసుకుంటోంది.. డ్రోన్లు, క్షిపణి దాడులను కాచుకుంటూనే తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. నేవీ, ఆర్మీ, వాయుసేన కదం తొక్కుతున్నాయి.
భారత్ ప్రయోగిస్తున్న ఒక్కో ఆయుధం పాక్ కు కోలుకోలేని దెబ్బనే మిగులుస్తున్నాయి. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని బంకర్లలో దాక్కున్నట్లుగా కథనాలు వచ్చాయి. మరోవైపు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కూడా అత్యంత అప్రమత్తంగా ఉంటూ పాక్ పన్నాగాలను తిప్పకొడుతోంది.
సరిహద్దుల్లో ఇంతటి ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యాధిపతికి ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. దీని ప్రకారం .. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకోవచ్చు. క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వాడుకునేలా ఆర్మీ చీఫ్కు కేంద్రం ఓకే చెప్పింది.
టెరిటోరియల్ ఆర్మీ అంటే రిజర్వ్ ఫోర్స్. భారత సైన్యానికి మద్దతుగా పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడినది ఇది. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ అధికారులు (జేసీవోలు), నాన్ కమిషన్డ్ అధికారులు ఉంటారు. రెగ్యులర్ సైన్యంలోని వారికి సమానమైన ర్యాంకులు ఉన్న పౌర వృత్తులను నిర్వహించే ఇతర సిబ్బంది ఉంటారు. టెరిటోరియల్ ఆర్మీ ప్రధాన పాత్ర.. రెగ్యులర్ సైన్యానికి స్టాటిక్ విధుల నుంచి ఉపశమనం కలిగించడం. అవసరమైన సందర్భాల్లో రెగ్యులర్ సైన్యానికి సాయం చేస్తుంది.
1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ద్వారా ఇది ఏర్పాటైంది. భారత సైన్యం నుంచి నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ -ర్యాంకింగ్ అధికారి, రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం కింద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వం వహిస్తారు. టెరిటోరియల్ ఆర్మీ రెండు యూనిట్లను కలిగి ఉంది. 1962లో చైనాతో యుద్ధంలో , 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధంలో టెరిటోరియల్ ఆర్మీ పాల్గొనడం గమనార్హం.