పాకిస్థాన్ సైనిక స్థావరాలు ధ్వంసం: కేంద్రం
ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ మొదటిసారి చర్యను చేపట్టినట్టు ఆర్మీ ప్రకటించింది.
By: Tupaki Desk | 10 May 2025 2:51 PM ISTపహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి.. 26 మంది పౌరుల మృతికి ప్రతీకారంగా భారత దేశం ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన దాడులు.. ప్రపంచ వ్యాప్తంగా భారత్కు మన్ననలు తెచ్చి పెట్టాయి.
అయితే.. దీనిని తమపై జరిగిన దాడిగా భావిస్తున్న పాకిస్థాన్.. భారత్పై నేరుగా యుద్ధానికి దిగింది. దీనిని ప్రతిఘటిస్తూ.. భారత్ ఎదురు దాడి ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ మొదటిసారి చర్యను చేపట్టినట్టు ఆర్మీ ప్రకటించింది.
భారత్ లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ సైనిక స్థావరాలను నేలమట్టం చేసినట్టు వివరించారు. వీటిలో రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్లోని రాడార్ సైట్, సియాల్కోట్లోని విమానయాన స్థావరం ఉన్నాయని తెలిపింది. వీటిపై దాడి చేయాలని భారత్ నిర్ణయించుకోలేదని.. కానీ, పాకిస్థాన్ చేస్తున్న దాడులకు ప్రతిగా భారత్ తన లక్ష్యాలను నిర్దేశించుకుందని ఆర్మీ వెల్లడించింది. ఆయా సైనిక స్థావరాలపై శనివారం ఉదయం విరుచుకుపడినట్టు పేర్కొంది.
మరోవైపు.. హర్యానాలోని సిర్సాలో పాక్ క్షిపణిని ప్రయోగించింది. అయితే.. దీనిని భారత సైన్యం ధ్వంసం చేసిందని కేంద్రం ప్రకటించింది. సిర్సా సబ్జీ మండి(కూరగాయల దుకాణం)కి దారితీసే వీధి నుండి నేరుగా ఖాజా ఖేడా పొలాలలోకి పాక్ క్షిపణిని ధ్వంసం చేసినట్టు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్షిపణి తాలూకు.. శకలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. పంజాబ్లోని పలు నివాసాలపై పాక్ డ్రోన్ దాడులకు దిగింది. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంస మయ్యాయని.. వెంటనే బాధితులను ఆదుకున్నామని ఆర్మీ తెలిపింది.