పాక్ కు బిగ్ షాక్... దాయాదీ ప్రయత్నాలను గాల్లో కలిపేసిన భారత్!
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడానికి పాకిస్థాన్ గురువారం వరుస ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 5:12 PMసరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడానికి పాకిస్థాన్ గురువారం వరుస ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 15 నగరాల్లోని సైనిక స్థావరలే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే.. ఆ ప్రయత్నాన్ని భారత్ బలంగా తిప్పికొట్టింది. ఈ సమయంలో గురువారం రాత్రి జమ్మూ లక్ష్యంగా పాక్ మరోసారి డ్రోన్లను ప్రయోగించింది!
అవును... భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించినట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ప్రధానంగా జమూలోని ఓ ఎయిర్ స్ట్రిప్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.
మరోవైపు సాంబ జిల్లాలో పాకిస్థాన్ రేంజర్లు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్లు కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల సైరన్ శబ్ధాలు వినిపిస్తున్నాయి! ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలంతా బ్లాక్ అవుట్ పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది!
ఈ సందర్భంగా.. జమ్మూ సివిల్ ఎయిర్ పోర్ట్, ఆర్.ఎస్.పురా, ఆర్నియా, సాంబా, పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ నుంచి సుమారు ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే... ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకొందని సమాచారం.
ఇదే సమయంలో... పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ ని భారత్ చాకచక్యంగా కూల్చివేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దగ్గర భారీ పేలుడు శబ్ధం వినిపించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో... పాక్ కి చెందిన జేఎఫ్-17 ఫైటర్స్ జెట్స్ రెండింటిని భారత్ కూల్చివేసినట్లు తెలుస్తోంది.
అయితే... భారత సైన్యం వేగవంతమైన, నిర్మాణాత్మకమైన చర్య వల్ల తాజా పాక్ ప్రయత్నం కారణంగా ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అంటున్నారు. దీంతో... భారత్ – పాక్ మధ్య ఈ దాడి ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.