Begin typing your search above and press return to search.

పాక్ ని నమ్మొద్దు అంటున్న నేతలూ నెటిజన్లు !

ఎన్నడూ లేని విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకకంఠంతో మద్దతు ఇచ్చాయి. పాక్ మీద యుద్ధానికి సై అన్నాయి.

By:  Tupaki Desk   |   10 May 2025 9:21 PM IST
పాక్ ని నమ్మొద్దు అంటున్న నేతలూ నెటిజన్లు !
X

ఎన్నడూ లేని విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకకంఠంతో మద్దతు ఇచ్చాయి. పాక్ మీద యుద్ధానికి సై అన్నాయి. ఇక అంతర్జాతీయ సమాజం కూడా భిన్న స్వరాలు ఉన్నప్పటికీ బాహాటంగా భారత్ విషయంలో దూకుడు చేయవద్దు అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. పహిల్గాంలో ఉగ్ర దాడి తరువాత భారత్ పైన ప్రపంచం అంతా సాఫ్ట్ కార్నర్ ని ప్రదర్శించింది.

పాక్ పూర్తిగా డిఫెన్స్ లో పడింది. ఇంత మంచి అవకాశంతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రమూకల పోస్టులని నాశనం చేసింది. అది భారత్ లో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. చరిత్రలో నిలిచేలా మే నెల 7వ తేదీని అంతా గుర్తు పెట్టుకున్నారు. అయితే మే 10వ తేదీకి వచ్చేసరికి కాల్పుల నిలుపుదల నిర్ణయం మాత్రం అందరినీ కొంత అసంతృప్తికి గురి చేసింది.

ముఖ్యంగా కోట్లాది మంది ప్రజానీకం మాత్రం భారత్ పెద్దలూ పాక్ ని నమ్మవద్దు అన్న సందేశం ఇస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే ఇది మంచి నిర్ణయం కాదని నెట్టింట విమర్శలు చేస్తున్నారు. పాక్ ని అలా వదిలేస్తే ఇంతకు ముంచి ఉగ్రదాడులు జరుగుతాయని అంటున్నారు. మరి కొందరు అయితే ముందుకెళ్ళి అసలు అమెరికా పెత్తనం ఏమిటి ఆ దేశం చెబితే వినాలా అని నిలదీస్తున్నారు.

ఇజ్రాయిల్ కానీ ఉక్రెయిన్ కానీ అమెరికా మాట విని కాల్పులను నిలుపుదల చేశాయా అని ప్రశ్నిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనపరచుకున్న మీదట ఈ కాల్పుల నిలుపుదల ప్రకటించి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఇపుడు తొంబై శాతం చచ్చి చతికిలపడిన పాక్ ని ఆ పది శాతం దెబ్బ తీసి ఉంటే శాశ్వతంగా పాక్ లోని ఉగ్ర పీడ భారత్ కి ఉండేది కాదని కూడా నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట.

ఇక రాజకీయ విశ్లేషకులు మేధావులు అయితే శాంతి ఎపుడూ మంచిదే కానీ అవతల ప్రత్యర్థులు కూడా అదే ఉద్దేశ్యంతో ఉంటేనే శాంతి సందేశానికి అర్ధమూ పరమార్ధమూ ఉంటాయని అంటున్నారు. పాక్ జిత్తుల మారి నక్క అని అందువల్ల ఆ దేశంతో చర్చలు అయినా శాంతి మాటలు అయినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని అంటున్నారు.

ఇక దేశంలోని రాజకీయ పార్టీల నేతలు అయితే కాల్పుల నిలుపుదలని ప్రకటించిన భారత్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే పాక్ తో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. పాక్ దొంగ ఎత్తులను ఒక కంట కనిపెట్టాల్సిందే అని అంటున్నారు.

కాల్పుల విరమణను స్వాగతిస్తూనే అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య కేంద్రానికి సూచించారు. భారత్, పాకిస్థాన్ రెండూ అంగీకరిస్తే మంచిదే. అయితే మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని కేంద్ర పెద్దలకు ఆయన సూచించారు.

అదే విధంగా కాల్పుల విరమణను స్వాగతిస్తూ, ఇది పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకు దారితీయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను తొలగించాలని, ఆ దేశంలో ఉగ్రవాదానికి కేంద్రాలుగా మారకుండా చూడాలని ఆయన అన్నారు. అది కొనసాగినంత కాలం ఈ సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుందని కపిల్ సిబాల్ అభిప్రాయపడ్డారు. అంతే కాదు ఇది తాత్కాలిక కాల్పుల విరమణ అని ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.

పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ నాయకుడు భగవంత్ మాన్ మాట్లాడుతూ కాల్పుల విరమణను స్వాగతించారు. అయితే పూర్తి నిఘా అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇక మీదట పంజాబ్ అప్రమత్తంగా ఉంటుందని, అంతర్జాతీయ సరిహద్దులో యాంటీడ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శాంతి అత్యవసరం అన్నారు. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదని ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పడానికే భారత్ యుద్ధం చేసిందని అన్నారు. ఇలా నాయకులు అంతా తమ అభిప్రాయలను పంచుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నుంచి కాల్పుల నిలుపుదల వరకూ జరిగిన మొత్తం వ్యవహారాలను చర్చించడానికి పార్లమెంట్ ని పిలవాలని ఆయన కోరారు.