పీవోకే భారత్ లో విలీనం కావాల్సిందే !
పాక్ ఆక్రమిత కాశ్మీర్ షార్ట్ కట్ లో పీఓకే. అసలు కాశ్మీర్ అన్నది 1947 నాటికి ఒక స్వతంత్ర రాజ్యం.
By: Tupaki Desk | 10 May 2025 6:24 PM ISTపాక్ ఆక్రమిత కాశ్మీర్ షార్ట్ కట్ లో పీఓకే. అసలు కాశ్మీర్ అన్నది 1947 నాటికి ఒక స్వతంత్ర రాజ్యం. దానిని భయపెట్టి బెదిరించి తమలో కలుపుకోవాలని కొత్తగా ఒక దేశంగా ఆనాడు ఏర్పాటు అయిన పాక్ చేయాల్సింది అంతా చేసింది. అయితే కాశ్మీర్ ని ఏలుతున్న రాజు భారత్ తోనే ఉంటేనే తమకు మనుగడ క్షేమం అనుకుని భారత్ వైపు మొగ్గు చూపాడు. అలా భారత్ లో కాశ్మీర్ చేరడం జరిగింది. అయితే ఇది గిట్టని పాకిస్థాన్ కాశ్మీర్ మీద యుద్ధం చేసి తమలో కలిపేసుకోవాలని చూసింది.
ఆ సమయంలో భారత్ తన సైన్యాన్ని కాశ్మీర్ కి పంపించి పాక్ తో యుద్ధం చేసింది. అలా పాక్ ని తరిమికొట్టింది. అయితే అందులో మూడవ వంతు భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుని కూర్చుంది. భారత్ లో విలీనం అయిన కాశ్మీర్ వద్ద రెండు వంతులు భూభాగం ఉంది.
ఇది జరిగి దాదాపు ఎనభై ఏళ్ళు గడుస్తున్నా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మాత్రం భారత్ తిరిగి తెచ్చుకో లేకపోతోంది. ఆ లోటు అలాగే ఉంది. ఈ మధ్యలో 1965లో పాక్ తో భారత్ జరిగిపిన యుద్ధంతో భారత్ గెలిచింది. అయినా ఆక్రమిత కాశ్మీర్ ని తెచ్చుకోలేదు. 1971లో అయింతే పాక్ భూభాగం మీదనే వెళ్ళి లాహోర్ దాకా భారత్ సైనికులు కదం తొక్కి పాక్ కి శృంగభంగం చేశారు. అయినా ఈసారి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తెచ్చి కలుపుకోలేదు. 1999లో కార్గిల్ యుద్ధం లో భారత్ విజేతగా నిలిచినా పీఓకే అన్న ఇష్యూ రాకుండానే ముగిసింది.
ఇక ఇపుడు చూస్తే అన్ని విధాలుగా భారత్ కి అనుకూలత ఉంది. ప్రపంచంలోని కొన్ని అగ్ర రాజ్యాలు భారత్ పాక్ యుద్ధం మీద సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. మరికొన్ని దేశాలు ముఖం మీద నవ్వు తెర వెనక విషం చిమ్మవచ్చు. ఎవరు ఏమి చేసినా ఇది భారత్ సార్వభౌమాధికారానికి సంబంధించిన సమస్య. అందువల్ల భారత్ ఈ యుద్ధంలో సాధించాల్సింది ఏంటి అంటే పీఓకేని వెనక్కి తెచ్చుకుని భారత్ లో కలుపుకోవడం అని అంతా అంటున్నారు.
ఇది ఏకంగా 146 కోట్ల మంది భారతీయుల కోరిక. ఇది భారత్ ప్రతిష్టను పెంచే అంశం. ఇది ఉగ్రవాదానికి శాశ్వతంగా ముకుతాడు వేసే విషయం కూడా. తనది కాని ఆస్తిని ఎవరికో రాసి ఇచ్చినట్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చైనాకు కొంత భూభాగం ఇచ్చింది. అలా చైనా తన దేశం నుంచి పీవోకే దాకా రోడ్లు వేసింది.
పీవోకేను స్వాధీనం చేసుకుని చైనా వైపు ఉండే రోడ్లను మూసివేసి మిగిలిన దానిని మొత్తం భారత్ వాడుకోవాలి. అక్కడ కొండ ప్రాంతం ఎక్కువ కాబట్టి జనాభా తక్కువగానే ఉన్నారు. ఇక గత ఏడున్నర దశాబ్దాలుగా వారి మేలు కోసం పాక్ ఏమీ చేసింది లేదు. వారు కనుక భారత్ తో ఉంటామని అంటే కలుపుకోవాలి. లేదా వారు పాక్ లోకి వెళ్తామంటే వారి ఆప్షన్ కే వదిలిపెట్టాలి.
అలా సంపూర్ణ కాశ్మీర్ ని సాధించడమే కాకుండా వ్యూహాత్మకంగా భారత్ కి ఎంతో కలసి వచ్చే పీవోకేని స్వాధీనంలో ఉంచుకుని అక్కడ భారత జవాన్లతో కీలక ప్లేస్ లలో పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఉగ్రవాదుల పీడను శాశ్వతంగా వదిలించుకోవచ్చు అన్నది మాజీ సైనిక అధికారులు చెబుతున్న మాట. ఇదే మొత్తం దేశం మాటగా ఉంది.
ఆ మధ్యన దేశ రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా పీవోకే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సో అది ఇపుడు నిజం కాబోతోంది అని అంతా ఆశాభావంతో ఉన్నారు. పాక్ పహల్గాం దాడిని ఉగ్రవాదులతో చేయించిన దానికి ఇది సరైన గుణపాఠంగా కూడా ఉంటుందని అంటున్నారు. పీఓకే స్వాధీనంతో పాక్ కోరలు విరిచినట్లు అవుతుంది అని అంటున్నారు.
పీవోకే ఎటూ భారత్ భూభాగం కాబట్టి అంతర్జాతీయ సమాజం కూడా భారత్ ని ఏ విధంగానూ తప్పు పట్టే అవకాశం ఉండదని అంటున్నారు. సో ఆ విధంగా భారత్ విజయకేతనం ఎగురవేయాలని అంతా గట్టిగా కోరుకుంటున్నారు. ఆ రోజు తొందరలోనే వస్తుందని ధీమాగా కూడా భారతీయులు అంతా ఉన్నారు.