మే 7న యుద్ధ సైరన్ వినిపించగానే... ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం!
పహల్గాం ఉగ్రదాడితో బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
By: Tupaki Desk | 6 May 2025 10:01 AMపహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం పాక్ కు భారత్ పలు దౌత్యపరమైన షాకులు ఇచ్చింది. అయితే ఇవి మాత్రమే సరిపోదు.. మరింత స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. ఈ సమయంలో మే7న దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్ నిర్వహించనుంది.
అవును... పహల్గాం ఉగ్రదాడితో బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మరోపక్క ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత సైన్యం కాశ్మీర్ లో జల్లెడ పడుతుంది. ఇదే సమయంలో.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పనికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా ప్రకటించింది.
ఇదే సమయంలో.. తమపై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాక్ లోని నేతలు, మాజీ దౌత్యవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో బుధవారం మే7న దేశంలో యుద్ధ సైరన్ మోగనుంది. దేశంలోని 244 జిల్లాలో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో.. ఆ రోజున ఏమి చేస్తారు? ఎలాంటి పరిణామాలు నెలకొంటాయి? అనే సందేహాలు సహజంగానే చాలా మందిలో ఉండొచ్చు! అయితే.. ఇది యుద్ధానికి సిద్ధం కావడానికి ఒక మాక్ డ్రిల్ అనే విషయం అంతా గుర్తు పెట్టుకోవాలి! ఈ సందర్భంగా... ఈ మాక్ డ్రిల్ లో యుద్ధం లేదా వైమానిక దాడులు వంటి పరిస్థితుల్లో ఏమి చేయాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాయి.
ఈ సమయంలో యుద్ధ సైరన్ లను పోలీసు ప్రధాన కార్యాలయాలు, సైనిక స్థావరాలు, అగ్నిమాపక కేంద్రాలు, నగరంలోని రద్దీగా ఉండే ఎత్తైన ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. సైరన్ శబ్ధం వీలైనంత వరకూ చేరేలా చేయడమే దీని లక్ష్యం. దీనిని దేశంలోని ప్రతీ నగరంలోనూ ఇన్ స్టాల్ చేయవచ్చు! ఇది రెగ్యులర్ హారన్, అంబులెన్స్ సౌండ్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఈ వార్ సైరన్ల శబ్ధం సాధారణంగా రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకూ వినబడుతుంది. ఈ సైరన్ 120-140 డెసిబుల్స్ శబ్ధం చేస్తుంది. ఈ సమయంలో టీవీ, రేడియోల్లో ప్రభుత్వ హెచ్చరికలను రెగ్యులర్ గా గమనించండి.. పుకార్లకు దూరంగా ఉండండి.. అధికారుల సూచనలు పాటించండి!
ఈ వైమానిక దాడి హెచ్చరిక సైరన్ ల అమలుకు సంసిద్ధతను తనిఖీ చేయడం, శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి రక్షణ అంశాలపై ప్రజలకు శిక్షణ ఇవ్వడం ఈ మాక్ డ్రిల్ లో భాగంగా జరుగుతుందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ మాక్ డ్రిల్ లో భారత వైమానిక దళంతో హాట్ లైన్, రేడియో కమ్యునికేషన్ లింక్ ల నిర్వహణ, కంట్రోల్ రూమ్ ల కార్యచరణను పరీక్షించడం ఉంటాయి.