Begin typing your search above and press return to search.

తాజా కొవిడ్ కేసులతో టెన్షన్ పడాల్సింది ఎంత?

విన్నంతనే ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. జీవితంలో కొవిడ్ నాటి పరిస్థితులు మళ్లీ ఎదురు కాకూడదన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే కొవిడ్ అన్నంతనే ఉలికిపాటు ఖాయం.

By:  Tupaki Desk   |   29 May 2025 4:05 AM
తాజా కొవిడ్ కేసులతో టెన్షన్ పడాల్సింది ఎంత?
X

విన్నంతనే ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. జీవితంలో కొవిడ్ నాటి పరిస్థితులు మళ్లీ ఎదురు కాకూడదన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే కొవిడ్ అన్నంతనే ఉలికిపాటు ఖాయం. గడిచిన కొంతకాలంగా కొవిడ్ మాట అప్పుడప్పుడూ వింటున్నా.. ఈసారి మాత్రం సౌండ్ కాస్త ఎక్కువగానే వినిపిస్తోంది. విదేశాల్లోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్న తీరు.. తాజా వేరియంట్ ను అంత సింఫుల్ గా తీసుకోకూడదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఈ వేరియంట్ మీద మరింత అప్రమత్తత పెరిగేలా అడ్వైజరీ విడుదలైంది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తన ప్రకటనతో టెన్షన్ తెప్పించలేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని.. మంగళవారం రాత్రి నాటికి దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసులు 1010గా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్ కొత్త వేరియంట్ ఎన్ బీ.1.8.1తో పాటు ఎల్ఎఫ్.7ను భారతదేశంలో గుర్తించిన విషయం తెలిసిందే. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర కొవిడ్ కేసుల వ్యాప్తి తక్కువగానే ఉందంటున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మినహాయిస్తే.. ముఖానికి మాస్కులు పెట్టుకొంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపించని పరిస్థితి.

ఇలాంటి వేళ కొవిడ్ తాజా వేరియంట్ను ఎంత సీరియస్ గా తీసుకోవాలి? జాగ్రత్తల విషయంలో ఎలా ఉండాలి? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు పరిస్థితిని సమీక్షిస్తే.. కొవిడ్ తాజా వేరియంట్ల తీవ్రత మన దేశంలో తక్కువగా ఉన్నా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక.. కొవిడ్ కేసులు పెరగటానికి కారణం.. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం.. టీకాలు వేసుకోవటం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి క్షీణించటం కూడా కారణంగా చెబుతున్నారు.

ఇప్పుడు వెలుగు చూసిన కొత్త వేరియంట్లు (జేఎన్.1, ఎన్ బీ 1.8.1) బాధితుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన దాఖలాలు కనిపించ లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు.. గాలిలో తేమ శాతం అదికంగా ఉండటం లాంటి పరిస్థితుల్లో కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే. సింగపూర్.. ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో మాత్రం కొవిడ్ వ్యాప్తి కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్లుగా కనిపిస్తోంది. దేశంలో నమోదైన మొత్తం యాక్టివ్ కేసుల్లో 43 శాతం కేరళలోనే ఉండగా.. తర్వాత మహారాష్ట్ర 21 శాతంతో.. ఢిల్లీ (10 శాతం).. గుజరాత్.. తమిళనాడు రాష్ట్రాలు సింగిల్ డిజిట్ లో ఉన్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 ఏళ్లకు పైబడిన వారు.. అనారోగ్యాలతో బాధ పడే వారు మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవటం తప్పనిసరిగా చెబుతున్నారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించటం.. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటం.. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే స్వీయ నిర్భందంలోకి వెళ్లటం లాంటి చర్యలు తీసుకోవటం మంచిదంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వేరియంట్లను బూచీలా చూసి భయపడటం కన్నా.. అప్రమత్తతతో జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పక తప్పదు.