బిగ్ బ్రేకింగ్... కులగణనపై కేంద్రం సంచలన నిర్ణయం!
ఇదే సమయంలో.. కులగణన పేరుతో పలు రాష్ట్రాలో కాంగ్రెస్ సర్వే చేయించిందని.. అందులో పారదర్శకత లేదని కేంద్రం పేర్కొంది.
By: Tupaki Desk | 30 April 2025 11:55 AMతాజాగా బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... త్వరలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టనుంది. ఈ సందర్భంగా... జాతీయ జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అవును... దేశంలో కులగణనకు సంబంధించి కేంద్రం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... వచ్చే జనాభా లెక్కల్లో కులగణను చేర్చుతామని తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో.. కులగణన పేరుతో పలు రాష్ట్రాలో కాంగ్రెస్ సర్వే చేయించిందని.. అందులో పారదర్శకత లేదని కేంద్రం పేర్కొంది.
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి అశ్విని వైష్ణవ్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణనను కేవలం రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నరని.. కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించడానికి సర్వేలు నిర్వహించాయని.. ఇందులో కొన్ని రాష్ట్రాలు బాగా చేశాయని వైష్ణవ్ తెలిపారు.
అయితే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అలాంటి సర్వేలను పూర్తిగా రాజకీయ కోణం నుంచి పాదర్శకత లేకుండా నిర్వహించాయని అన్నారు. ఇటువంటి సర్వేలు సమాజంలో పలు సందేహాలు సృష్టించాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు.
వాస్తవానికి కేంద్రం కుల గణన చేపట్టాలని కాంగ్రెస్, ఇండియా కూటమి, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో తన సొంత కుల గణన చేపట్టింది. అయితే.. ఇది లింగాయత్ లు, వొక్కలిగ వర్గాల నుంచి అభ్యంతరాలను ఎదుర్కోంది.
కాగా... అక్టోబర్ 2023లో బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం.. ఆర్జేడీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సమయంలో కుల సర్వేను ముందుకు తీసుకెళ్లింది. దీంతో.. అటువంటి డేటాను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర జనాభాలో ఏయే కులం ప్రజలు ఎంతమందనే వివరాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా... రాష్ట్ర జనాభాలో 36శాతం మంది అత్యంత వెనుకబడిన తరగతులకు చెందినవారు, 27.1 శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందినవారు, 19.7 శాతం షెడ్యూల్ కులాలకు చెందినవారు, 1.7 శాతం షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది.