Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. `నోరు క‌ట్టేసిన` భార‌త్‌!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్ లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడి అనంతరం.. కేంద్ర ప్ర‌భుత్వం దాయాది దేవం పాకిస్తాన్‌పై ఉక్కు పిడికిలితో విరుచుకుప‌డుతోంది.

By:  Tupaki Desk   |   28 April 2025 8:00 AM
India Cracks Down on Pakistan-Based YouTube Channels
X

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్ లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడి అనంతరం.. కేంద్ర ప్ర‌భుత్వం దాయాది దేవం పాకిస్తాన్‌పై ఉక్కు పిడికిలితో విరుచుకుప‌డుతోంది. పాకిస్థాన్ పౌరుల‌ను దేశం నుంచి వెళ్లిపోవాల‌ని ఆదేశించడంతోపాటు.. వారిని ఉన్న‌ప‌ళాన పంపించేస్తున్నారు కూడా.. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్రం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీనిలో భాగంగా పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్ల‌పై వేటు వేసింది. సుమారు 16 యూట్యూబ్ ఛానెళ్ల‌ను నిషేధిస్తూ.. కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏం చేస్తున్నారు..?

పాకిస్థాన్ యూట్యూబ‌ర్లు, అక్క‌డి పౌరులు.. కొంద‌రు యూట్యూబ్ చానెళ్ల ద్వారా.. భార‌త్‌పై విషం క‌క్కుతు న్నారు. ప‌హ‌ల్గాం దాడికి.. పాకిస్థాన్‌కు సంబంధం లేద‌ని.. భార‌త్ రెచ్చ‌గొట్టేలా చేస్తోద‌ని వ్యాఖ్య‌లు చేస్తు న్నారు. ఇక‌, సింధు న‌ది జ‌లాలపై మ‌రింత ఎక్కువ‌గా విష ప్ర‌చారం చేస్తున్నారు. గ‌త నాలుగు రోజులుగా ఇవి కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయి. దీంతో జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఏర్ప‌డింది. పైగా.. యువ‌త రెచ్చిపోయే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన కేంద్రం ఈ చానెళ్ల‌పై వేటు వేసింది.

అదేవిధంగా పాకిస్థాన్ మీడియా చానెళ్ల‌ను కూడా కేంద్రం నిషేధించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లను కూడా నిలిపివేసింది. వీటిలో కీల‌క‌మైన డాన్‌, జియో న్యూస్‌, సామా టీవీలు ఉన్నాయి. అదేవిధంగా పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టుల సామాజిక మాధ్య‌మ‌ ఖాతాలపైనా నిషేధం విధించారు. మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్ ను కూడా నిషేధించారు. దీంతో పాకిస్థాన్ చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకోవ‌డంతోపాటు ఆదేశం నోరు నొక్కిన‌ట్టు అయింది.