'ఏఐ' ఉద్యోగాల జాతర.. హైదరాబాద్, విజయవాడల్లో ఏఐ కొలువుల జోరు!
ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త స్కిల్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి.
By: Tupaki Political Desk | 26 April 2026 2:00 PM ISTఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు, మాంద్యం భయాలు ఉన్నాయని వింటున్న తరుణంలో.. కేవలం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) విభాగంలో నియామకాలు 59.5% పెరగడం నిరుద్యోగులకు, టెక్ నిపుణులకు గొప్ప ఆశాకిరణం. ప్రపంచ దేశాలైన అమెరికా, యూకేను వెనక్కి నెట్టి భారత్ ఏఐ నైపుణ్యాల్లో అగ్రగామిగా ఎదుగుతుండడం విశేషం.
లింక్డ్ఇన్ తాజా నివేదిక ప్రకారం.., భారత్ ప్రస్తుతం ప్రపంచ ‘ఏఐ హబ్’గా మారుతోంది. గతేడాదితో పోలిస్తే ఏఐ ఇంజినీర్ల నియామకాల్లో 59.5% వృద్ధి నమోదు కావడం సామాన్యమైన విషయం కాదు. కేవలం బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ (51%), విజయవాడ (45.5%) నగరాల్లో కూడా నియామకాలు పెరుగుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటోందని గణాంకాలు నిరూపిస్తున్నాయి.
భారీ డిమాండ్ కు కారణాలు..
ప్రతి సంస్థ ఇప్పుడు తన ఉత్పాదకతను పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ను ఒక అనివార్య సాధనంగా భావిస్తోంది. సాధారణ పనులను మనుషుల ప్రమేయం లేకుండా పూర్తి చేసే ‘ఏఐ ఏజెంట్స్’ వినియోగం పెరిగింది. దీనివల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నాయి. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచే ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్ అభివృద్ధి చేయడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అజూర్ ఏఐ స్టూడియో (Azure AI Studio) వంటి ప్లాట్ఫారమ్లపై పట్టున్న నిపుణులకు కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.
డిమాండ్లో ఉన్న నైపుణ్యాలు
ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త స్కిల్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. డేటా నుంచి కీలకమైన అంశాలను స్వయంచాలక పద్ధతిలో సేకరించే నైపుణ్యం ఉండాలి. తయారు చేసిన ఏఐ మోడల్స్ను వాస్తవ ప్రపంచంలో ఎలా అమలు చేయాలి, పర్యవేక్షించాలో తెలిసిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. టెక్స్ట్, ఇమేజ్ లేదంటే కోడ్ను సృష్టించగల ఏఐ వ్యవస్థలను నిర్మించడంలో నిపుణులకు భారీ ప్యాకేజీలు లభిస్తున్నాయి.
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్గా గుర్తింపు సంపాదించింది. 51% నియామకాల వృద్ధి అంటే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని అర్థం. మరోవైపు విజయవాడలో 45.5% వృద్ధి నమోదవడం శుభపరిణామం అనే చెప్పాలి. సెకండ్ గ్రేడ్ నగరాల్లో కూడా ఏఐ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని విజయవాడను చూస్తే తెలుస్తోంది.
సాధారణ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ స్థానంలో ఇప్పుడు ఏఐ ఇంజినీరింగ్ వచ్చి చేరుతోంది. ఈ మార్పు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాదు, హెల్త్కేర్, ఫైనాన్స్, రిటైల్ వంటి రంగాల్లో కూడా ఏఐ ఇంజినీర్ల అవసరం ఉంది. రాబోయే ఐదేళ్లలో ఏఐ అనేది ప్రతి వృత్తిలోనూ భాగంగా మారుతుంది. కాబట్టి, విద్యార్థులు, టెక్ నిపుణులు తమను తాము ఏఐ రంగంలో అప్డేట్ చేసుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ల దిశగా తీసుకెళ్లడంలో ఈ 'ఏఐ విప్లవం' వెన్నుముకగా నిలవనుంది.
