Begin typing your search above and press return to search.

ఎకరా భూమి ఐదువేలు... ఏమిటీ "హైదరాబాద్‌ హౌస్‌" స్పెషాలిటీ?

జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ లు ఒక ప్రత్యేక ప్రదేశంలో కలుసుకున్నారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 2:23 PM GMT
ఎకరా భూమి ఐదువేలు... ఏమిటీ  హైదరాబాద్‌  హౌస్‌ స్పెషాలిటీ?
X

"హైదరాబాద్ హౌస్"... 1920ల్లోనే సుమారు రూ.50 లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ భవనం తాజాగా జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాలతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. సుమారు 95 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హౌస్ ఎప్పుడు, ఎందుకు, ఎలా నిర్మించారు.. దీనికి యజమాని ఎవరు.. ప్రత్యేకతలేమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ లు ఒక ప్రత్యేక ప్రదేశంలో కలుసుకున్నారు. అదే "హైదరాబాద్ హౌస్"! స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం ఈ "హైదరాబాద్ హౌస్" ను నిర్మించారు.

అసలు ఎందుకు కట్టారు?:

స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో వందల సంఖ్యలో ఉండే సంస్థానాల సమన్వయంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం 1920లో "ది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్"ను ప్రారంభించింది. అయితే ఈ ఛాంబర్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుండేవి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చేది. పైగా అక్కడ సదుపాయాలు కూడా అంతంత మాత్రంగా ఉండేవి.

దీంతో ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానానికి నిజాంగా ఉండే మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఢిల్లీలో తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ సమీపంలోని 8.2 ఎకరాల స్థలాన్ని నిజాం కొనుగోలు చేశారు. ఆ భూమి కూడా సరిపోకపోవడంతో పక్కనే ఉన్న మరో భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. అప్పుడు ఎకరం భూమి ఖరీదు రూ. 5000 కావడం గమనార్హం!

ఎంత ఖర్చుతో కట్టారు?:

భూమి కొనుగోలు అనంతరం ఈ భవనం డిజైన్ ను నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్‌ కు అప్పగించారు. దీంతో ఎడ్విన్ లుటియన్స్ "హైదరాబాద్ హౌస్" కోసం "సీతాకోక చిలుక" ఆకారంలో డిజైన్‌ ను సిద్ధం చేశారు. ఆ డిజైన్ నచ్చడంతో అందుకోసం రూ.26 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచారు.

బర్మా టెకు – న్యూయార్క్ లైట్లు - లండన్ ఇంటీరియల్:

నిజాం ఈ భవన నిర్మాణానికి అవసరమైన టేకు కలపను బర్మా (ప్రస్తుతం మయన్మార్) నుంచి తెప్పించారు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌ లు, ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి ఆర్డర్ చేశారు. ఇదే సమయంలో లండన్ లోని ఇంటీరియర్ డిజైనింగ్‌ లో ప్రసిద్ధి చెందిన సంస్థలకు ఆ పనులు అప్పగించారు. ఇక అలంకారంలో భాగంగా 1921లో ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులందరి నుంచి దాదాపు 17 పెయింటింగ్స్‌ ఆర్డర్ ఇచ్చారు.

అప్పట్లో ఈ పెయింటిగ్స్‌ ధర రూ.10,000 నుండి 20,000 వరకు ఉండేది. వీటితోపాటు లాహోర్‌ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహ్మాన్ చుగ్తాయ్ వేసిన రూ. 12,000 విలువైన 30 పెయింటింగ్‌ లను కూడా ఆర్డర్ చేశారు. కార్పెట్‌ లను ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించారు.

పూర్తయిన భవనాన్ని చూసిన నిజాం రియాక్షన్?

ఇలా మొదలైన ఈ భవన నిర్మాణం 1928 నాటికి పూర్తయింది. ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉండగా... అందులో నాలుగు గదులు మహిళలకు సంబంధించినవి. ఈ క్రమంలో సుమారు దశాబ్ధకాలానికి పూర్తయిన ఈ భవనాన్ని చూసి నిజాం ఎంతో బాదపడ్డారంట.

అవును... ఈ స్థాయిలో ఇంతలా ఖర్చు పెట్టి, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్మించిన ఈ "హైదరాబాద్‌ హౌస్‌"లోకి నిజాం అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఆయన ఎంతో బాధపడ్డారంట. పూర్తయిన ఈ భవన నిర్మాణం అనంతరం... దానిని "గుర్రపుశాల"తో పోల్చారట నిజాం. దీంతో సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఇది కొన్ని చౌక భవనాల కాపీ మాత్రమే అని పేర్కొన్నారట.

ఇప్పుడు ఈ భవనానికి యజమాని ఎవరు?:

స్వాతంత్రం వచ్చిన అనంతరం సుమరు 560 సంస్థానాలూ భారతదేశంలో విలీనమయ్యాయి. ఈ సమయంలో 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ "హైదరాబాద్ హౌస్"ని లీజుకు తీసుకుంది. దీనికోసం 1970ల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తూ వచ్చింది.

అయితే కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాక... కేంద్ర - రాష్ట్ర మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ కి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో "హైదరాబాద్‌ హౌస్‌" కేంద్రానికి సొంతమయ్యింది.