నాన్న, అన్నయ్య పోలీసులు.. అతడికేమో ఉగ్ర లింకులు
హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాది సిరాజ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
By: Tupaki Desk | 19 May 2025 8:30 AMహైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాది సిరాజ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గ్రూప్-2 శిక్షణ నిమిత్తం నగరానికి వచ్చిన దుండగుడు సిరాజ్ ఉగ్ర సంస్థ ఐసిస్ తో లింకులు ఏర్పరుచుకోవడమే కాకుండా, విజయనగరంలో తన సొంత ఇంటికే పేలుడు పదార్థాలను తెప్పించుకోవడం, అక్కడ రిహార్సిల్స్ కు ప్లాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సిరాజ్ తండ్రి తండ్రి, సోదరుడు పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. సిరాజ్ ను కూడా పోలీసు అధికారిగా చూడాలని ఆ కుటుంబం భావించగా, అతడు చదువు పేరుతో హైదరాబాద్ కు వచ్చి ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరిని ఆదివారం కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరు విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మన్ కాగా, మరొకరు హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ గా పోలీసులు గుర్తించారు. సిరాజ్ ఉర్ రెహ్మన్ డిగ్రీ చదువుకుని గ్రూప్-2 శిక్షణ నిమిత్తం విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక సమీర్ నగరంలోనే లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తున్నాడని సమాచారం.
కేసు దర్యాప్తులో ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ ఇద్దరు ఆల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (అహిం) పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగించారు. ఆ సంస్థకు సిరాజ్ నంబర్ వన్ గా, సమీర్ నంబర్ టుగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.
సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రలో కోసం వీరిని ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో సౌదీ హ్యాండ్లర్ నిందితులతో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. దేశంలో పేలుళ్లకు పథకం రచించడంతోపాటు అందుకోసం పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటి పేలుడు రసాయనాలను ఆన్ లైన్ లో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ రసాయనాలతో బాంబు తయారు చేసిన ఈ నెలలో విజయనగరంలో రిహార్సిల్స్ నిర్వహించాలని నిందితులు ప్లాన్ చేశారని, ఇంతలోనే వీరి విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి కుట్రను భగ్నం చేశారని చెబుతున్నారు. కాగా, నిందితులు మరికొందరు యువకులు, మైనర్లతో సమావేశాలు నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తెలిసిందని చెబుతున్నారు. పేలుడు పదార్థాల కోసం రసాయనాలు తెప్పించడంతో హైదరాబాద్ పోలీసులు విజయనగరం పోలీసులకు సమాచారం పంపి నిందితుడు సిరాజ్ ను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా, పేలుడు రసాయనాలు లభ్యమయ్యాయని చెబుతున్నారు.
కాగా, సౌదీ హ్యాండ్లర్ గాలానికి నిందితులు ఎలా చిక్కారనే విషయంపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. హ్యాండ్లర్ వీరిని ‘మ్యాజిక్ లాంతర్’ ద్వారా ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టు పెట్టి, దానికి సానుకూలంగా స్పందించే (లైక్ మైండెడ్) వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ఉద్దేశంగా చెబుతున్నారు. నిందితులు తమ గ్రూపులో మొత్తం28 మందిని చేర్చుకున్నారని గుర్తించారు. అగ్గిపుల్లల్లోని మందును వినియోగించి బాంబు తయారు చేసే విధానంపై హ్యాండ్లర్ వీరికి ఫైళ్లు పంపినట్లు తేలింది. దీనికి అనుగుణంగానే యువకులు బాంబును తయారు చేశారని, ఈ నెల12న సిరాజ్ విజయనగరం దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాడని పోలీసులు తెలిపారు.