11 బ్యాంకు అకౌంట్లు.. రెండు సార్లు సౌదీకి ట్రిప్పులు
హైదరాబాద్ లో పేలుళ్లకు జరిగిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు దుండగులకు ఉగ్ర లింకులపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
By: Tupaki Desk | 20 May 2025 8:30 PMహైదరాబాద్ లో పేలుళ్లకు జరిగిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు దుండగులకు ఉగ్ర లింకులపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు మంగళవారం విజయనగరం జిల్లాకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నందున విశాఖ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేయాలని న్యాయమూర్తి సూచించారు. దుండగులను వారం రోజులు కస్టడీకి తీసుకుని వారికి ఉగ్ర సంస్థలతో ఎలా బంధం కలిసిందో తెలుసుకోవాలని ఇటు పోలీసులతోపాటు ఎన్ఐఏ ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా కేసు వెలుగు చూసిన వెంటనే విజయనగరం చేరుకున్న ఎన్ఐఏ అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో విధ్వంసానికి ప్రయత్నించిన విజయనగరం వాసి సిరాజ్ విషయంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. డిగ్రీ చదవి హైదరాబాద్ లో గ్రూప్-2 శిక్షణ నిమిత్తం వచ్చిన సిరాజ్.. ఎవరికీ తెలియకుండా రెండు సార్లు సౌదీకి వెళ్లినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా అతడికి 11 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే అనుమానం వస్తుందనే ఆలోచనతో నిందితుడు సిరాజ్ సహకార బ్యాంకుల్లో అకౌంట్లు తీసుకున్నాడని, అక్కడే లాకర్లు తెరిచాడని పోలీసులు గుర్తించారు.
చదువు, శిక్షణ పేరుతో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ కు చెందిన సమీర్ తోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మరో నలుగురితో కలిసి విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడిందని అంటున్నారు. ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పర్యటించారని, అక్కడ కొందరిని కలిశారని ఎన్ఐఏ అధికారుల విచారణలో తెలిసిందని అంటున్నారు. అంతేకాకుండా తమ కార్యకలాపాలు బయటపడకుండా సిగ్నల్ యాప్ లో సిరాజ్ టీం తరచూ మాట్లాడుకునేదని, ఏడాదిగా సిగ్నల్ యాప్ ద్వారానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పోలీసులు ఆ గ్రూపులో ఎవరున్నారు? వారు ఎక్కడివారు? అన్న విషయాలపై కూపీ లాగుతున్నారు.
ఇక ప్రస్తుతం జుడీషియల్ రిమాండులో ఉన్న దుండగులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు రాబట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న తర్వాత నిందితులను ఎన్ఐఏకి అప్పగించాలని భావిస్తున్నారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసరావు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు సిరాజ్ కు 11 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఉంటున్నట్లు నమ్మించి రెండు సార్లు సౌదీకి వెళ్లినట్లు తేలింది. నిరుద్యోగిగా ఉన్న అతడికి విదేశాలకు వెళ్లేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు టికెట్లు సమకూర్చింది? అక్కడ ఎవరిని కలిసింది? అన్న విషయాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఎన్ఐఏ అధికారులు దృష్టి పెట్టారు.