Begin typing your search above and press return to search.

హోంగార్డు రవీందర్ ది సూసైడా? హత్య?

హైదరాబాద్ లో హోంగార్డు రవీందర్ మృతి ఘటన పెను దుమారం రేపుతోంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 8:54 AM GMT
హోంగార్డు రవీందర్ ది సూసైడా? హత్య?
X

హైదరాబాద్ లో హోంగార్డు రవీందర్ మృతి ఘటన పెను దుమారం రేపుతోంది. పోలీసు ఉన్నతాధికారులు అవమానించారన్న కారణంతో రవీందర్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రవీందర్ మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. దీంతో, విధులు బహిష్కరించి హోంగార్డులు ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం కోసం రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన జీతం కోసం హెడ్ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ ఏఎస్ఐ నర్సింగరావు, కానిస్టేబుల్ చందుతో పాటు మరో ఇద్దరు తన అవమానించారని రవీందర్ మరణ వాంగ్మూలంలో చెప్పడం సంచలనం రేపింది. మిగతా హోంగార్డులకు ఇలా అన్యాయం జరగకుండా చూడాలంటూ పెట్రోల్ పోసుకొని రవీందర్ నిప్పంటించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులపై రవీందర్ భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద రవీందర్ మృతదేహానికి పోస్టుమార్టం కోసం సంతకం పెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 17 ఏళ్లుగా నిజాయితీగా విధులు నిర్వహించిన తన భర్త ఇలా చనిపోయారని కన్నీరు మున్నీరయ్యారు. తన భర్తను ఏఎస్ఐ నర్సింగరావు, కానిస్టేబుల్ చందులు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. వారిని ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెట్రోల్ బంక్ లో సిగరెట్ తాగుతుండగా ప్రమాదవశాత్తు రవీందర్ కు మంటలు అంటుకున్నాయని చెప్పాలంటూ హమీద్ అనే అధికారి తనకు బెదిరించారని ఆరోపించారు.

అలా చెబితేనే బెనిఫిట్ లు వస్తాయని తనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తన భర్త ఫోన్ అన్లాక్ చేసి డేటా మొత్తం డిలీట్ చేశారని ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంధ్య డిమాండ్ చేస్తున్నారు. తనతోపాటు, తన కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్పందన రావాల్సి ఉంది.