హిమాచల్ ప్రదేశ్ లో 'పుష్ప' సీన్... నెట్టింట కామెంట్స్ వైరల్!
ఇదే సమయంలో... ముఖ్యంగా కులు, ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయని వెల్లడించారు.
By: Tupaki Desk | 29 Jun 2025 12:04 PM ISTహిమాచల్ ప్రదేశ్ లో ఈ సంవత్సరం ముందస్తు, తీవ్రమైన రుతుపవనాలు సంభవించాయని.. దీని వలన ఆకస్మిక వరదలు, విస్తృతమైన మౌలిక సదుపాయాల నష్టం, అనేక జిల్లాల్లో విషాదకరమైన ప్రాణనష్టం సంభవించిందని రెవెన్యూ, ఉద్యానవన, గిరిజన అభివృద్ధి మంత్రి జగత్ సింగ్ నేగి తాజాగా తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 17 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో... ముఖ్యంగా కులు, ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయని వెల్లడించారు. అదేవిధంగా... భారీ వర్షాల కారణంగా రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ లైన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని నేగి అన్నారు. ఇందులో భాగంగా.. సుమారు 37 రోడ్లు మూసుకుపోయాయని, దాదాపు 47 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
అదేవిధంగా... కొన్ని ప్రాంతాలలో చిన్న వంతెనలు కొట్టుకుపోయాయని, దీనివల్ల లోకల్ కనెక్టివిటీ మరింత దెబ్బతింటుందని ఆయన అన్నారు. ఒక వారంలోనే భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం రూ.300 కోట్లు దాటిందని మంత్రి జగత్ సింగ్ నేగి వెల్లడించారు. మరోవైపు.. ఈ వరదల కారణంగా 'పుష్ప' సినిమాలో సీన్ రిపీటయ్యిందంటూ నెట్టింట ఓ విషయం వైరల్ గా మారింది.
అవును... హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు డ్యామ్ లలోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ సమయంలో బీబీఎంబీ పండోహ్ డ్యామ్ లోకి వరదనీటితో పాటు టన్నులకొద్దీ కలప కొట్టుకు వచ్చింది. అధికారులు డ్యామ్ గేట్లు అయిదింటిని ఎత్తడంతో పెద్ద ఎత్తున కలప నదిపై తేలుతూ కనిపిస్తోంది.
దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు వైరల్ కాడంతో నెటిజన్లు 'హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా?'.. ‘హిమాచల్ ప్రదేశ్ లో పుష్పరాజ్ లు ఎక్కువే!’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ, ఆ సినిమాలోని ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు.. దీంతో రాష్ట్రంలో చెట్లను అక్రమంగా నరకడం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
