రోటీన్ కు భిన్నంగా ఆరోగ్య కిటుకులు చెప్పిన మోడీషాలు
రాజకీయ నాయకులు అన్నంతనే అది ఇది అన్న తేడా లేకుండా చాలా విషయాల గురించి మాట్లాడతారు.
By: Tupaki Desk | 20 April 2025 4:53 AMరాజకీయ నాయకులు అన్నంతనే అది ఇది అన్న తేడా లేకుండా చాలా విషయాల గురించి మాట్లాడతారు. అయితే.. వీరిలో ఎవరూ కూడా ఆరోగ్యం గురించి.. ఫిట్ గా ఉండటం గురించి పెద్దగా మాట్లాడటం కనిపించదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఆయనకు నీడలా వ్యవహరించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఒక పద్దతి పాడు లేకుండా.. ఇష్టారాజ్యంగా రాజకీయ నేతల జీవితాలు ఉంటాయని చెబుతారు. అందుకు భిన్నంగా అమిత్ షా మాత్రం తానెంత క్రమబ్దద్దంగా వ్యవహరిస్తానో చెప్పుకొచ్చారు.
లివర్ డే సందర్భంగా శనివారం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తాను బరువు తగ్గిన విషయాన్ని ప్రస్తావించారు. 2020 నుంచి పాటిస్తూ వస్తున్న ఆరోగ్య సూత్రాల కారణంగా తాను బరువు తగ్గానని చెప్పారు. కంటినిండా నిద్ర.. నీరు.. సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం అనే నియమాల్ని పాటిస్తున్నట్లు చెప్పారు.
ఈ కారణంగానే ఎలాంటి అల్లోపతి మందులు వాడాల్సిన అవసరం తనకు రాలేదన్నారు. డయాబెటిస్ లాంటి వాటి బారిన పడలేదన్నారు. నేటి యువతరం కూడా ఇలాంటి నియమాల్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు రోజులో రెండు గంటలు వ్యాయామానికి కేటాయించాలని.. మెదడు ఆరోగ్యం కోసం ఆరు గంటలేు నిద్రపోవాలన్నారు. ఇది చాలా అవసరమన్న అమిత్ షా.. ఇదే తన అనుభవంగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. అమిత్ షా ఆరోగ్య సూత్రాలపై ఎక్స్ లో పోస్టు చేయగా.. దానికి ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆయన మరో కీలక సూచన చేశారు. ఆరోగ్యాన్ని పెంచుకోవటం కోసం వంట నూనెల వాడకాన్ని పది శాతం తగ్గించాలన్నారు. ఈ చిన్న చర్యతో పెద్ద మార్పు చూస్తామన్న ఆయన.. ఊబకాయంపై మరింత అవగాహన పెంచుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించుకుందామన్నారు. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవటం లో భాగంగా.. రోజువారీగా తీసుకునే ఆహారంలో వాడే వంట నూనె వినియోగాన్ని పది శాతం తగ్గిస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలంటూ ప్రజలకు పోస్టు చేశారు కేంద్ర మంత్రి నడ్డా.