ఏఐ విస్పోటనంపై సుందర్ పిచయ్ సంచలన వ్యాఖ్యలు
ఈ కృత్రిమ మేధ అన్నది ఎంత వరకు మేలు చేస్తుంది, లేదా ఎంత వరకూ దాని ప్రతికూల ప్రభావం పడుతుంది అన్నది ఎవరికి తోచిన తీరున వారు విశ్లేషిస్తున్నారు.
By: Satya P | 18 Nov 2025 10:30 PM ISTప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ మీదనే చర్చ సాగుతోంది. ఈ కృత్రిమ మేధ అన్నది ఎంత వరకు మేలు చేస్తుంది, లేదా ఎంత వరకూ దాని ప్రతికూల ప్రభావం పడుతుంది అన్నది ఎవరికి తోచిన తీరున వారు విశ్లేషిస్తున్నారు. అయితే అందరూ ఆలోచించే తీరు ఒకటి అయితే ఐటీ నిపుణులు దిగ్గజ సంస్థల అధిపతులు చేసే విశ్లేషణ వారు ఆలోచించే విధానం వారి దృష్టి కోణం ఎపుడూ ప్రత్యేకంగా ఉంటుంది. అదే సమయంలో వారు చెప్పే వాటికి ఎంతో విలువ కూడా ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఏఐ గురించి గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చకు నోచుకుంటున్నాయి.
తట్టుకోవడం కష్టమే :
ఏఐ విస్పోటం మీద ఆయన మాట్లాడుతూ దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు. దాదాపుగా ప్రతీ కంపెనీ మీద ఏఐ ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందని సుందర్ పిచాయ్ అన్నారు. అదే సమయంలో ఏ కంపెనీ కానీ ఏ సంస్థ కానీ ఏఐ ప్రభావం నుంచి తప్పించుకోలేదని తట్టుకోనూ లేదని ఆయన కామెంట్స్ చేశారు. ఏఐ అన్న బుడగ కనుక ఒక్కసారి పేలితే ఆ ప్రభావం అన్నింటా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏఐకి పెట్టుబడులు :
అసలు ఏఐ మీద పెట్టుబడులు పెట్టడంలోనూ ఏ రకమైన హేతుబద్ధత లేదని ఆయన అన్నారు. నిజానికి ప్రస్తుతం ఏఐ మీద పెడుతున్న పెట్టుబడులు అధికం కావడం ఒక అసాధారణ సందర్భం అని ఆయన అన్నారు. ఏఐ బూం అన్న దానికి హేతు బద్ధత అయితే లేదని తేల్చేశారు. ఇక ఏఐ ప్రభావం మాత్రం అన్నింటా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా హెచ్చరించారు కూడా.
గూగుల్ సైతం :
ఏఐ ప్రభావానికి లోను కానీ సంస్థ ఏదీ ఉండదని అందులో తాము కూడా ఉన్నామని అంటూ గూగుల్ గురించి ఆయన ప్రస్తావించారు. తమ సంస్థ సైతం ఏఐ ప్రభావితమే అని స్పష్టం చేశారు. అయితే తాము దానిని ఎలా ఎదుర్కొంటామన్నది కూడా ఒక కీలక అంశం అన్నారు ఇక చూస్తే కనుక చాట్జీపీటీ, ఓపెన్ఏఐతో పోటీ ఉన్న నేపథ్యంలో ఆల్ఫాబెట్కు పెట్టుబడులు రెట్టింపు అయినట్లుగా ఆయన చెప్పారు. మరో వైపు ఇదే ఏఐకి చెందిన సూపర్ చిప్స్ను ఆల్ఫా సంస్థ అభివృద్ధి చేస్తోందని సుందర్ పిచాయ్ చెప్పడం గమనార్హం. ఇక కృతిమ మేధగా ఉన్న ఏఐని సర్వస్వం అనుకుంటే అంతకంటే పొరపాటు ఏదీ ఉండదని అన్నరు. ఏఐ చెప్పే ప్రతి విషయాన్ని నిజం అని అదే పరమార్ధం అని ఎవరూ గుడ్డిగా నమ్మకూడదని సుందర్ పిచయ్ చెప్పుకొచ్చారు.
