Begin typing your search above and press return to search.

ఎవడ్రా నువ్వు వీడియో తీస్తున్నావ్? టీడీపీ ఎమ్మెల్యే దూకుడు

తాజాగా ఒక ఇష్యూలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే వీడియోను తీస్తున్న ఈనాడు విలేకరిపై బూతుపురాణం అందుకోవటమే కాదు..

By:  Tupaki Desk   |   1 April 2025 4:27 AM
ఎవడ్రా నువ్వు వీడియో తీస్తున్నావ్? టీడీపీ ఎమ్మెల్యే దూకుడు
X

గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు కొందరు తమ్ముళ్లలో ఎక్కువ అవుతుంది. తాజాగా ఆ జాబితాలో చేరారు శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్. 47 ఏళ్ల వయసున్న ఆయన.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి 52వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

చురుగ్గా ఉంటారన్న పేరుతో పాటు.. దూకుడు ప్రదర్శిస్తారంటూ ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. తాజాగా ఒక ఇష్యూలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే వీడియోను తీస్తున్న ఈనాడు విలేకరిపై బూతుపురాణం అందుకోవటమే కాదు.. కెమెరా తీసుకొని ఫోటోల్ని .. వీడియోల్ని డిలీట్ చేయటమే కాదు.. నోరు పారేసుకున్నవైనం సంచలనంగా మారింది.

ఎందుకంటే.. ఈనాడు.. ఆంధ్రజ్యోతి ఇలా కొన్ని మీడియా సంస్థలన్నంతనే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా అదనపు గౌరవ మర్యాదల్ని ఇస్తుంటారు. అందుకు భిన్నంగా శ్రీకాకుళంలో చోటు చేసుకోవటం గమనార్హం. ఇంతకూ ఈ రచ్చకు నేపథ్యం ఏమిటి? అన్న అంశంలోకి వెళితే.. శ్రీకాకుళం గ్రామీణ మండలం కందువానిపేటలో సోమవారం ఒక కార్యక్రమం జరిగింది.

ఈ ప్రోగ్రాం పూర్తైన తర్వాత పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విషయంలో పంచాయితీ కార్యదర్శి సరిగా స్పందించటం లేదంటూ కంప్లైంట్ చేశారు. దీంతో.. అక్కడే ఉన్ పంచాయితీ కార్యదర్శి ధుర్యోధనుడుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాటకాలు ఆడుతున్నావా? మరో పార్టీకి ఊడిగం చేస్తున్నావా? ఇక్కడి నుంచి పంపించేస్తే నేనేంటో తెలుస్తుందంటూ సీరియస్ అయ్యారు. దీన్ని ఈనాడు రిపోర్టర్ షూట్ చేయటం టీడీపీ ఎమ్మెల్యేకు మరింత ఆగ్రహాన్ని రగిల్చింది.

ఎవడ్రా నువ్వు.. వీడియో ఎందుకు తీస్తున్నావు? అంటూ నోరు పారేసుకున్నారు. తాను ఫలానా విలేకరి అన్నప్పటికి పట్టించుకోలేదు సరికదా.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కెమెరాలో ఉన్న ఫోటోలు.. వీడియోల్ని తొలగించమని హుకుం జారీ చేశారు. అంతేకాదు.. సదరు విలేకరి మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీకి దన్నుగా ఉంటారన్న అభిప్రాయం ఉన్న మీడియా సంస్థ ప్రతినిధిపై ఎమ్మెల్యే గొండు శంకర్ వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. సదరు సంస్థ సైతం అతడి తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఇలాంటి తీరును ప్రదర్శిస్తున్నారని.. గతంలో ఇలా చేసేవారు కాదన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.