ఇప్పుడు గోవా “భోగ్ భూమి” కాదు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే అది ఒకప్పుడు.. ఇప్పుడు గోవా బీచ్ ల కంటే ఎక్కువగా దేవాలయాలు, సంస్కృతి విషయంలో ఎక్కువమందిని ఆకర్షిస్తోందని అంటున్నారు సీఎం ప్రమోద్.
By: Tupaki Desk | 18 May 2025 2:30 PMసాధారణంగా కాస్త లాంగ్ వీకెండ్ వచ్చినా, హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేయాలని భావించినా, సముద్ర తీరంలో సూర్యోదయాన్ని మరింత కొత్తగా ఆస్వాధించాలని అనుకున్నా ఎక్కువమంది యువత గోవాను ఒక బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటారని అంటారు. అయితే అది ఒకప్పుడు.. ఇప్పుడు గోవా బీచ్ ల కంటే ఎక్కువగా దేవాలయాలు, సంస్కృతి విషయంలో ఎక్కువమందిని ఆకర్షిస్తోందని అంటున్నారు సీఎం ప్రమోద్.
అవును... గోవా ఒకప్పుడైతే సూర్యుడు, ఇసుక, సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ ఆనందించడానికి వచ్చేవారని అయితే.. ఇప్పుడు మాత్రం దేవాలయాలు, సంస్కృతి కోసం ఎక్కువమందిని గోవా ఆకర్షిస్తోందని.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. ఈ సందర్భంగా గోవా ఇప్పుడు "భోగ్ భూమి" (ఆనంద భూమి) కాదు.. "యోగ భూమి" (భక్తి, యోగా భూమి), "గో మాత భూమి" (ఆవుల భూమి) అని అన్నారు.
ఇదే సమయంలో... ఒకప్పుడు గోవాకు ప్రజలు వచ్చినప్పుడల్లా ఇది భోగ్ భూమిగానే అనుకునేవారు కానీ.. ఇది ఇప్పుడు యోగ భూమి అని అన్నారు. ఇక్కడ సనాతన సంస్థ ఆశ్రమం కూడా ఉందని తెలిపారు. తాజాగా "సనాతన రాష్ట్ర శంఖనాద్ మహోత్సవ్" కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది పరశురాముడి భూమి అని నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా... విష్ణువు అవతారమైన పరశురాముడు అరేబియా సముద్రంలోకి బాణం వేసి, దాన్ని వెనక్కి నెట్టి గోవాని సృష్టించారని ముఖ్యమంత్రి సావత్ అన్నారు! ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రంలోని బీచ్ ల కంటే శుభ్రమైన, అందమైన దేవాలయాలు ఎక్కువమందిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలను స్థానిక సమాజాలే నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
సనాతన్ సంస్థ వ్యవస్థాపకుడు జయంత్ అథవాలే 83వ జయంతి సందర్భంగా ప్రసంగించిన సావంత్... గతంలో ప్రజలు సూర్యుడు, ఇసుక, సముద్రం చూడటానికి గోవాను సందర్శించేవారని.. అయితే, ఇప్పుడు అది మారిందని. ఇప్పుడు పర్యాటకులు మన గొప్ప సంస్కృతి, దేవాలయాలను అనుభవించడానికి ఇక్కడికి వస్తున్నారని తెలిపారు!