పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పీఓకే నిరసనలు
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 3 Jun 2025 5:18 AMఆపరేషన్ సిందూర్ దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాక్ అక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్ - బాల్టిస్టాన్ లోని వ్యాపారుల నిరసనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. పాక్ తన ప్రయోజనాల కోసం తమను పణంగా పెడుతున్నట్లుగా వారు మండిపడుతున్నారు. వ్యాపారుల ఆందోళనలకు అక్కడి రాజకీయ పార్టీల మద్దతు తోడు కావటంతో నిరసనల ఉద్యమం మరింతగా పెరుగుతోంది. వేలాది మంది వ్యాపారులు.. స్థానికులు కలిసి గుల్మార్ట్ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు. చైనా - పాక్ ఎకనామిక్ కారిడార్ లో కలికితురాయి లాంటి కారాకోరమ్ నేషనల్ హైవేను మూడు రోజులుగా దిగ్బంధించారు.
దీంతో పాకిస్థాన్ - చైనా మద్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. చైనాకు లబ్థి చేకూరేలా ఆర్థిక విధానాల్ని పాక్ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొంటూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాపారులకు తోడుగా హుంజా.. సమీప పట్టణాల నుంచి వేలాదిగా విద్యావేత్తలు.. పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. అదే సమయంలో భారత్ కు అనుకూల నినాదాలు చేయటం గమనార్హం.
భారత్ లోని కార్గిల్ ను కలిపే రోడ్డును మళ్లీ తెరవాలని.. సరకుల దిగుమతులకు అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ నిరసన షబ్బీర్ మయ్యార్ ఆధ్వర్యంలో జరుగుతోంది. దీంతో ఆయన్ను ఉగ్రవ్యతిరేక చట్టం కింద పాక్ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా గిల్గిత్ - బాల్టిస్తాన్ లో ఇమ్రాజ్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని.. వారి నిర్ణయాలతో తమకు సంబంధం లేదని నవాజ్ పార్టీ చెబుతోంది.
పీటీఐ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలతోనే స్థానిక వ్యాపారం దెబ్బ తిందని.. గడిచిన ఆర్నెల్లుగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. స్థానిక ప్రభుత్వం ఉగ్రవాదులకు క్షమాభిక్షలు పెట్టి.. వ్యాపారుల్ని పట్టించుకోవటం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరకుల కొరతతో ధరలు విపరీతంగా పెరిగిపోయి.. సామాన్యులు అల్లాడిపోతున్నట్లుగా వారు వాపోతున్నారు. వ్యాపారులు.. స్థానికుల నిరసనలు.. ఆందోళనతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.