Begin typing your search above and press return to search.

ఆద్యంతం ఆసక్తికరం.. అంకెల్లో సార్వత్రిక ఎన్నికలు!

లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లోనూ జరగనుంది. ఇంతకూ ఆ 4 రాష్ట్రాలు ఏవంటే..

By:  Tupaki Desk   |   17 March 2024 5:15 AM GMT
ఆద్యంతం ఆసక్తికరం.. అంకెల్లో సార్వత్రిక ఎన్నికలు!
X

యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ స్థానాలకు ఒకేసారి జరిగే ఈ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లోనూ జరగనుంది. ఇంతకూ ఆ 4 రాష్ట్రాలు ఏవంటే..

1. ఆంధ్రప్రదేశ్

2. ఒడిశా

3. అరుణాచల్ ప్రదేశ్

4. సిక్కిం

దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్ని మొత్తం ''7'' దశల్లో నిర్వహించనున్నారు. ఇంతకూ ఏ దశలో ఎన్నేసి రాష్ట్రాల్లో నిర్వహించనున్నారన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగో దశలో జరగనున్నాయి. 2019లో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా సాగాయి. ఇంతకూ ఏ దశలో ఎన్నేసి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నది చూస్తే..

మొదటి దశలో 21 రాష్ట్రాలు

రెండో దశలో 13 రాష్ట్రాలు

మూడో దశలో 12 రాష్ట్రాలు

నాలుగో దశలో 10 రాష్ట్రాలు

ఐదో దశలో 8 రాష్ట్రాలు

ఆరో దశలో 7 రాష్ట్రాలు

ఏడో దశలో 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం ''7'' దశల్లో జరిగే ఎన్నికల్లో ఏ దశలో ఎన్నేసి ఎంపీ స్థానాల్లో ఎన్నికల్ని నిర్వహిస్తారన్నది చూస్తే..

మొదటి దశలో 102 స్థానాలు

రెండో దశలో 89 స్థానాలు

మూడో దశలో 94 స్థానాలు

నాలుగో దశలో 96 స్థానాలు

ఐదో దశలో 49 స్థానాలు

ఆరో దశలో 57 స్థానాలు

ఏడో దశలో 57 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి.. ''7'' దశల్లో జరిగే ఎన్నికల విషయానికి వస్తే.. ఏ దశ ఎన్నికలు ఏ తేదీల్లో జరుగుతాయి? అన్నది ప్రశ్న. ఆ విషయానికి వస్తే..

తొలి దశ ఎన్నికల పోలింగ్ తేదీ ''ఏప్రిల్ 19''

రెండో దశ ఎన్నికల పోలింగ్ తేదీ ''ఏప్రిల్ 26''

మూడో దశ ఎన్నికల పోలింగ్ తేదీ ''మే 07''

నాలుగో దశ ఎన్నికల పోలింగ్ తేదీ ''మే 13''

ఐదో దశ ఎన్నికల పోలింగ్ తేదీ ''మే 20''

ఆరో దశ ఎన్నికల పోలింగ్ తేదీ ''మే 25''

ఏడో దశ ఎన్నికల పోలింగ్ తేదీ ''జూన్ 01''

ఇంతకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అన్న విషయానికి వస్తే.. ఈసారి ''4'' దశలో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా 'మే 13' పోలింగ్ డేగా చెప్పాలి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగుతాయి. తెలంగాణలో మాత్రం 17 లోక్ సభా స్థానంతో పాటు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ స్థానానికి పోలింగ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇదే రోజున ఒడిశాలోనూ ఇదే రోజున పోలింగ్ జరగనుంది.

తెలంగాణలోని ఒక అసెంబ్లీ స్థానంతో పాటు యావత్ దేశం మొత్తంలో ''26'' అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ''7'' దశల్లో సాగే పోలింగ్ కు సంబంధించిన రిజల్ట్ డేగా ''జూన్ 4'' (మంగళవారం)ను చెప్పాలి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. జూన్ 4 మధ్యాహ్నం 2 గంటల నాటికి ఏ కూటమికి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాల్ని సొంతం చేసుకోనుందన్న సుమారు లెక్క.. అధిక్యతకు సంబంధించిన సమాచారం క్లారిటీ రానుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎన్నికల పోలింగ్ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ ఉన్నప్పటికీ.. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ఎప్పుడు పోలింగ్ అన్న విషయాన్ని ప్రకటించలేదు. దీనికి సంబంధించిన వివరాల్ని త్వరలో ప్రకటిస్తామని ఈసీ వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే..

మొత్తం పురుష ఓటర్లు ''49.7'' కోట్లు

మొత్తం మహిళా ఓటర్లు ''47.1'' కోట్లు

మొత్తం ట్రాన్స్ జెండర్ ఓటర్లు 48 వేల మంది

మొత్తం 96.8 కోట్ల మంది (ట్రాన్స్ జెండర్లు కాకుండా. మొత్తం ట్రాన్స్ జెండర్లు 48 వేల మంది)ఓటు హక్కు వేసుకునే అవకాశాన్ని సార్వత్రిక ఎన్నికలు అవకాశాన్ని ఇవ్వనున్నాయి. వీరిలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు ''21 లక్షలు'' కాగా వందేళ్లు దాటిన వారు '2.18' లక్షల మంది ఉండటం గమనార్హం. దేశ వ్యాప్తంగా ఈసారి తొలిసారి ఓట్లు వేస్తున్న ఓటర్ల సంఖ్య ''1.80'' కోట్లు. ఇక.. 85 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు.. దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే వీలుంది. మొత్తం ఓటర్లలో 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుగా గుర్తించారు. 20-29 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 19.47 కోట్లు.

దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోను చూసినప్పుడు 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. ప్రతి వెయ్యి మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 10.50 లక్షల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ''55 లక్షలు'' ఈవీఎంలను వినియోగించనున్నారు. '4 లక్షల' వాహనాల్ని ఎన్నికల విధి నిర్వహణ కోసం వినియోగిస్తారు.