Begin typing your search above and press return to search.

వైసీపీలోకి గంటా వస్తారా...!?

ఇక చీపురుపల్లి పాలిటిక్స్ కూడా చూస్తే గంటాకు మింగుడుపడని రాజకీయం అక్కడ ఉంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:53 AM GMT
వైసీపీలోకి గంటా వస్తారా...!?
X

విశాఖ జిల్లా టీడీపీకి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్నది ఇపుడు చర్చ సాగుతోంది. ఆయన రాజకీయ జీవితంలో ఇపుడు కీలక ఘట్టంలో ఉన్నారు. ఈసారి తీసుకునే నిర్ణయంతోనే ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అయితే ఏకైక ఆప్షన్ ఇచ్చింది. అది చీపురుపల్లి నుంచి పోటీ చేయడం. అక్కడ పోటీ చేసి గంటా గెలిస్తే ఆయనకు మళ్లీ తిరుగులేదు. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా కూడా కావచ్చు. కానీ పొరపాటున ఓడితే ఆయన పొలిటికల్ కెరీర్ ఇబ్బందులో పడుతుంది.

ఇక చీపురుపల్లి పాలిటిక్స్ కూడా చూస్తే గంటాకు మింగుడుపడని రాజకీయం అక్కడ ఉంది. బొత్స బలమైన నేత. ఆయనను ఢీ కొట్టడం వరకూ ఓకే అయినా గెలుపు అవకాశాలు ఎంత మేరకు అంటే జవాబు కష్టం. విశాఖ జిల్లాలో గంటా అసెంబ్లీ సీట్లు మార్చినా ఆయన అందరికీ తెలిసిన వారు కావడంతో మేనేజ్ చేసుకోగలిగారు. అదే చీపురుపల్లిలో అయితే ఈ అతి తక్కువ టైం లో కష్టం అని అంటున్నారు.

అందుకే గంటా మధ్యేమార్గంగా నెల్లిమర్ల టికెట్ అడుగుతున్నారని తెలుస్తోంది. అయితే దానికి హై కమాండ్ నుంచి రియాక్షన్ లేదు అని అంటున్నారు. పైగా అక్కడ పోటీ గట్టిగా ఉంది. జనసేన కోరుతోంది. టీడీపీలో సీనియర్ల మధ్యన పోరు ఉంది. ఈ నేపధ్యంలో గంటా చీపురుపల్లి వెళ్లకపోతే రెండవ ఆప్షన్ ఏంటి అంటే పార్టీ మారడం.

ఆయన పార్టీ మారాలనుకుంటే ఉన్నవి జనసేన వైసీపీలు మాత్రమే. జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. కానీ జనసేన బీజేపీలు టీడీపీ తో పొత్తులోనే ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళినా టీడీపీ వద్ద మాట చెల్లింపు చేసుకోలేరు. దాంతో వైసీపీయే ఆయనకు ఏకైక దారిగా కనిపిస్తోంది అని అంటున్నారు.

గతంలోనే వైసీపీలోకి రావాలని గంటా అనుకున్నారు. కానీ నాడు అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డు పడ్డారు. ఇపుడు గంటా వస్తాను అంటే వైసీపీ ఓకే అంటుందా అంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. గంటాకు భీమిలీ టికెట్ కావాలి. ఆయన అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు. పైగా గతంలో 44 వేల ఓట్ల తేడాతో గెలిచారు. మంచి అనుచర గణం ఉంది.

అంగబలం అర్ధబలం కలిగిన నేతగా ఉన్నారు. దాంతో భీమిలీలో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని వైసీపీ పరిశీలిస్తే మాత్రం ఆయన చేరవచ్చు అని అంటున్నారు. భీమిలీలో అవంతి శ్రీనివాసరావు పనితీరు మీద వ్యతిరేకత ఉంది. ఆయనను మార్చాలి అనుకున్నా సరైన క్యాండిడేట్ లేరని అంటున్నారు. దాంతో ఆయన విషయం ఇపుడు పెద్దగా వైసీపీ పట్టించుకోవడంలేదు.

ఇపుడు గంటా ఎపిసోడ్ తో వైసీపీ అలెర్ట్ అయింది అని అంటున్నారు. అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీకి పంపించి భీమిలీ సీటుని గంటాకు ఇవ్వడం ద్వారా ఆయన్ని పార్టీలో చేర్చుకోవచ్చు అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. గంటా కనుక వైసీపీ లోకి రావాలనుకుంటే అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంది. హై కమాండ్ తలచుకుంటే గంటాను చేర్చుకుని భీమిలీ టికెట్ ఇవ్వడం క్షణంలో పని అని అంటున్నారు.