టీడీపీ మాజీ మంత్రికి బాడ్ టైం నడుస్తోందా ?
ఏమో ప్రజా జీవితంలో ఉన్న వారు కీలక రంగాలలో ఉన్న వారు అనేక సెంటిమెంట్స్ ని నమ్ముతారు.
By: Tupaki Desk | 7 May 2025 3:00 AMఏమో ప్రజా జీవితంలో ఉన్న వారు కీలక రంగాలలో ఉన్న వారు అనేక సెంటిమెంట్స్ ని నమ్ముతారు. వారు ఎక్కువగా వాటి మీదనే ఆధారపడతారు. ఇక కొంతమంది విషయం చూస్తే వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అపుడు వారిది లక్కీ జాతకం అంటారు. మరికొంతమంది ఎంత కష్టపడినా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వారి విషయంలో వేరేలా ఆలోచిస్తారు.
ఇవన్నీ పక్కన పెడితే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయంగా ప్రతికూలతలు ఎదురవుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. మంత్రి కావాల్సిన జాతకం అయితే బొమ్మ తిరగబడినట్లు తిరగబడింది. ఇక ఎన్నికల ముందు అయితే భీమిలీ టికెట్ కోసం చాలా పోరాటం చేయాల్సి వచ్చింది.
గత పది నెలల కాలంలో అయితే పార్టీలో కూడా కీలక పదవిలో ఆయనని నియమించలేదు. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వివాదాస్పదం చేస్తున్నారు. ఈ మధ్యలో ఆయన విశాఖ టూ విజయవాడకు విమాన సేవలు లేవని సోషల్ మీడియాలో పోస్టు చేసి జనం సమస్యలు చెబితే దాని మీద పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారని ప్రచారం సాగింది.
ఇక ఆయన సొంత నియోజకవర్గం భీమిలీ పరిధిలోకి వచ్చే సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం వేళ ఏకంగా దుర్ఘటన జరిగి ఏడుగురు మరణించారు. ఇందులో ఆయన ప్రమేయం లేకపోయినా ఈ ఘటన జరగకుండా ఉంటే ఉత్సవం సక్సెస్ క్రెడిట్ ఆయన ఖాతాలో పడేది కదా అని అంటున్నారు
ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలసి విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు. పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్క్ శంకుస్థాపన కార్యక్రమం ఈ ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. అయితే ఈ కార్యక్రమం అ అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
కార్యక్రమం ముగిసిన తర్వాత, నాయకులతో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో జనం రావడంతో ఆ భారం తట్టుకోలేక సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు ఎవరికి ఏమి అయిందో కూడా తెలిసింది కాదు. కానీ అదృష్టవశాత్తూ మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో అటు అధికారులతో పాటు ఇటు పార్టీ నాయకులు హమ్మయ్య అనుకున్నారు.
దీనిని చూసిన వారు గంటాకే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు. ఈ ప్రమాదంలో కొండపల్లి కూడా ఉన్నా ఆయన మంత్రిగా తన గ్రాఫ్ ని ఇటీవల కాలంలో పెంచుకుంటూ పోతున్నారు మంచి మార్కులు సంపాదిస్తున్నారు. గంటా విషయం తీసుకుంటే ఆయన ఎందుకో అసహనం తో ఉంటున్నారు. దానికి తోడు గతంలో చేసిన జోరు ఇపుడు లేకుండా పోతోంది.
రాజకీయంగా చూస్తే మరోసారి మంత్రి పదవి చేపడితే ఇక హాయిగా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ టెర్మ్ లోనే జస్ట్ ఎమ్మెల్యేగా ఉంచేశారు అన్న ఆవేదన ఉంది. అయినా కాలికి బలపం కట్టుకుని గతానికి కంటే ఎక్కువగా తన నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. అలాటి సమయంలో ఇలాంటివి అనుకోనివి జరగడంతో మా నాయకుడికి ఏమి జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అని అనుచరులు అభిమానులు అంతా ఆలోచనలో పడుతున్నారు.