Begin typing your search above and press return to search.

యువగళానికి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనా...?

ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూండగా చంద్రబాబు అరెస్ట్ వార్త విని పాదయాత్రను మధ్యలో ఆపేశారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 2:30 AM GMT
యువగళానికి  పెద్ద ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనా...?
X

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఎపుడు అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది. లోకేష్ సెప్టెంబర్ 9 దాకానే యువగళం యాత్ర చేపట్టారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూండగా చంద్రబాబు అరెస్ట్ వార్త విని పాదయాత్రను మధ్యలో ఆపేశారు.

ఆ తరువాత నుంచి ఇప్పటికి సరిగ్గా 55 రోజులు గడచింది కానీ యువగళం యాత్ర మొదలెట్టలేదు. దానికి కారణాలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఏకంగా 52 రోజుల పాటు జైలులో ఉనారు. ఇక లోకేష్ ని కూడా సీఐడీ విచారణకు రెండు రోజుల పాటు పిలిచింది.

మరో వైపు లోకేష్ అటు ఢిల్లీ ఇటు రాజమండ్రి అంటూ తిరుగుతూ వస్తున్నారు. ఇపుడు చంద్రబాబు బయటకు వచ్చారనుకున్నా ఆయన రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, మీడియా మీటింగ్స్ మాట్లాడకూడదు, కేవలం ఆయన వైద్య చికిత్సల కోసమే మధ్యంతర బెయిల్ లభించింది. ఈ లోగా రెగ్యులర్ బెయిల్ రాకపోతే ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

దీంతో అంతా అయోమయంగా ఉంది. ఈ కారణంగానే లోకేష్ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నారని అంటున్నారు. తండ్రి నుంచి సూచనలు పొంది పార్టీని నడపడం ఇపుడు లోకేష్ ప్రధమ కర్తవ్యంగా ఉంది. ఇక పాదయాత్ర విషయానికి వస్తే ఇంకా నాలుగు జిల్లాలకు పైగా బాకీ ఉంది. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అంతా తిరిగి ఇచ్చాపురం దాకా వెళ్లాలి.

పాదయాత్ర ఇపుడు చేయాలనుకున్నా కచ్చితంగా యాభై రోజులకు పైగా పట్టేట్టు ఉంది అని అంటున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు ఆదిలోనే సినీ నటుడు తారకరత్న హఠాన్మరణం రూపంలో తొలి అడ్డంకి ఎదురైంది. ఆ తరువాత కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని దాటుకుంటూ లోకేష్ యాత్ర చేస్తూ వచ్చారు. ఇపుడు ఆ పాదయాత్రకు పెద్ద ఫుల్ స్టాప్ పడిపోయేలా ఉంది అని అంటున్నారు.

ఎందుకంటే నవంబర్ నెల ప్రస్తుతం నడుస్తోంది. ఇక డిసెంబర్ నెల జనవరి ఫిబ్రవరి మాత్రమే ఉన్నాయి. ఈ నెలలు చాలా కీలకం. మార్చిలో నోటిఫికేషన్ వచ్చేలోగానే పార్టీ పనులు పూర్తి చేసుకోవాలి. చంద్రబాబు బయట ఉంటే కనుక లోకేష్ కచ్చితంగా యాత్ర చేసేవారు అని అంటున్నారు.

అలా కాకపోవడం వల్లనే లోకేష్ మీద పార్టీ బాధ్యతలు పడుతున్నాయని అంటున్నారు. లోకేష్ అందుకే పాదయాత్ర కంటే పార్టీ ముఖ్యం అనుకుంటున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు పూర్తి స్థాయిలో బెయిల్ లభించి ఆయన మీద కోర్టు ఆంక్షలు పూర్తిగా సడలించిన తరువాతనే లోకేష్ పాదయాత్ర ఉంటుంది అని అంటున్నారు. అది కూడా ఈ నవంబర్లోనే ఏదో ఒకటి తేలాలి. లేకపోతే మాత్రం ఆ తరువాత బయటకు వచ్చినా తండ్రీ కొడుకులు ఇద్దరూ పార్టీ పనులలో తలమునకలు కావాల్సిందే అని అంటున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ఎంతవరకూ వచ్చిందంటే అదే జవాబు వస్తోంది అని అంటున్నారు.