Begin typing your search above and press return to search.

ఇష్యూ సీరియస్... దేశరాజధానికి ట్రాక్టర్లపై క్యూ కట్టిన రైతులు!

హస్తిన వేదికగా అన్నదాతలు మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 7:25 AM GMT
ఇష్యూ సీరియస్... దేశరాజధానికి  ట్రాక్టర్లపై క్యూ కట్టిన రైతులు!
X

హస్తిన వేదికగా అన్నదాతలు మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం సెంట్రల్ గవర్నమెంట్ తో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు "ఢిల్లీ చలో" పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా... పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు దేశ రాజధాని దిశగా కదిలారు. దీంతో రాజధానిలో పరిస్థితి టెన్షన్ గా మారిందని అంటున్నారు.

అవును... పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన - 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో... మంగళవారం ఉదయం 10 గంటలకు పంజాబ్‌ లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాదిమంది అన్నదాతలు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

ఇందులో భాగంగా సిటీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా రోడ్లపై భారీఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేశారు. కొన్ని చోట్ల కాంక్రీట్‌ బ్లాక్స్లు, ఇనుప కంచెలు అడ్డుగా పెట్టారు. ఇదే సమయంలో అన్నదాతల ఆందోళన దృష్ట్యా... ఢిల్లీ అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్‌ సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్‌ ను మూసివేశారు. ఇలా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది.

ఈ సందర్భంగా కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడారు. తాము బారికేడ్లను బద్దలుకొట్టాలనుకోవడం లేదని.. చర్చలతోనే తమ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని.. కానీ, కేంద్రం ఏ విధంగానూ సహాయం చేయడం లేదని అన్నారు. అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలుపెట్టినట్లు తెలిపారు.

ఇదే సమయంలో ఈ విషయాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఇందులో భాగంగా... అన్నదాతల ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టిందని.. ఈ క్రమంలోనే రైతులను నిర్బంధించేందుకు వీలుగా ఢిల్లీలోని బావనా ప్రాంతంలో తాత్కాలిక జైలుగా ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించిందని తెలిపారు. రైతన్నలను జైల్లో పెట్టడం సరికాదని స్పష్టం చేశారు.