Begin typing your search above and press return to search.

ఫిట్ గా ఉండే ఈ ప్రముఖ సీఈవోకు పాక్షిక పక్షవాతం.. ఎందుకిలా?

ఇంతకూ ఇదంతా ఎవరి గురించి అంటే.. ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు.. సంస్థ సీఈవోగా వ్యవహరిస్తున్న నితిన్ కామత్ గురించి.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:54 AM GMT
ఫిట్ గా ఉండే ఈ ప్రముఖ సీఈవోకు పాక్షిక పక్షవాతం.. ఎందుకిలా?
X

ఆయన వయసు 44 ఏళ్లు. బాడీకి కొవ్వు పట్టకుండా కేర్ ఫుల్ గా ఉంటారు. వ్యాపారం రంగంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంత పక్కాగా ఉంటాయో.. అంతే పక్కాగా రోజు ఫిట్ నెస్ విషయంలో కేర్ ఫుల్ గా ఉంటారు. అలాంటి ప్రముఖుడు అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆయన కోలుకోవటానికి దగ్గర దగ్గర ఆర్నెల్ల వరకు పడుతుందని చెబుతున్నారు. నడి వయసులో ఆరోగ్యం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండే ఆయన.. పాక్షిక పక్షవాతానికి గురి కావటం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఇదంతా ఎవరి గురించి అంటే.. ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు.. సంస్థ సీఈవోగా వ్యవహరిస్తున్న నితిన్ కామత్ గురించి.


తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో తన ఆసుపత్రి ఫోటోను షేర్ చేయటంతో పాటు.. తానున్న పరిస్థితి గురించి షాకిచ్చే పోస్టు పెట్టారు. ఆరు వారాల క్రితం తాను అకస్మాత్తుగా పాక్షిక పక్షవాతానికి గురైనట్లుగా అందులో పేర్కొన్నారు. తన ముఖం వంకర తిరిగిందని.. చదవటం.. రాయటం లాంటివి తాను చేయలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు కాస్త నయమైందని.. తాను కోలుకోవటానికి మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు సమయం పడుతుందని పేర్కొన్నారు.

తన తాజా అనారోగ్యానికి కారణం తన తండ్రి మరణం.. నిద్రలేమి.. తీవ్రమైన మానసిక అలసట.. డీహైడ్రేషన్.. పని ఒత్తిడి అంటూ పెద్ద జాబితా పేర్కొంటూ.. ఇందులో ఏదో ఒక దాని కారణంగా ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు. తన అనారోగ్యానికి కారణం ఏదైనా ఒక అంశం కారణమన్నారు. ఆరోగ్యం గురించి.. ఫిట్ నెస్ మీదా ఎక్కువ శ్రద్ద తీసుకునే తనకు ఇలా జరగటం ఏమిటని ఆశ్చర్యపోతున్నట్లుగా పేర్కొన్నారు.

పని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలని వైద్యులు తనకు సూచన చేశారని.. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ట్రెడ్ మిల్ మీద కాస్త రన్నింగ్ చేయగలుగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆసుపత్రి బెడ్ మీద చికిత్స తీసుకున్న వేళకు సంబంధించిన ఫోటోను పోస్టు చేయటం ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన పోస్టుకు ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ రియాక్టు అయ్యారు. తనకు తెలిసి నితిన్ తండ్రి మరణమే ఆయన్ను తీవ్రంగా కలిచి వేసి ఉంటుందన్న అంచనాను వ్యక్తం చేశారు. తన తండ్రి చనిపోయిన సమయంలో తనకు ఇలాంటి పరిస్థితే ఎదురైందన్న ఆయన.. కాస్త బ్రేక్ తీసుకోవాలని సూచన చేశారు. నితిన్ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కష్టపడాల్సిందే. ఆ విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండటం చాలా ముఖ్యమన్నది మర్చిపోకూడదు.