షాదీ డాట్ కామ్ స్కామ్.. విచారణలో షాకిచ్చే నిజాలు!
పెళ్లి కాని బ్యాచిలర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లిళ్లు జరిపించేందుకు చాలా వెబ్ సైట్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 April 2025 3:55 AMపెళ్లి కాని బ్యాచిలర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లిళ్లు జరిపించేందుకు చాలా వెబ్ సైట్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో ప్రొఫైల్స్ వెతుక్కుని పెళ్లాడే వారికి కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ తో ముప్పు తిప్పలు తప్పడం లేదు. కొందరు ప్రముఖులు ఆన్ లైన్ ఫేక్ ప్రొఫైల్స్ కారణంగా భారీగా డబ్బును కోల్పోతున్న ఘటనలు బయటపడుతున్నాయి. అలాంటి ఒక స్కామ్ గురించి ఇప్పుడు ఏపీ, తెలంగాణలో విస్త్రతంగా చర్చ సాగుతోంది.
నకిలీ ప్రొఫైల్ స్కామ్ లో ఇటీవల తెలంగాణ హై కోర్టు షాదీ డాట్ కామ్ కి తాఖీదులు జారీ చేసింది. ఈ కేసులో జూబ్లీహిల్స్ కి చెందిన ప్రముఖ మహిళా డాక్టర్ తాను ఫేక్ ప్రొఫైల్ కారణంగా మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేసారు. వంశీ కృష్ణ అనే వ్యక్తి ఏపీలోని యానాంకు చెందిన ఒక ఎమ్మెల్యే ఫోటోను ఉపయోగించుకుని తాను విదేశాల్లో ఉన్న డాక్టర్ కొడుకుని అని ప్రొఫైల్ క్రియేట్ చేసాడు. తాను రాజమండ్రికి చెందిన చెరుకూరి హర్షగా మహిళా డాక్టర్ కు పరిచయం చేసుకున్నాడు. అటుపై వధువు అతడిని పూర్తిగా నమ్మాక, తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని 11లక్షలు వసూలు చేసాడు. అయితే కొంత కాలానికి మహిళా డాక్టర్ తన డబ్బు తనకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంతో అసలు భండారం బట్టబయలైంది. అతడు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తానని, మరో 10లక్షలు చెల్లించాలని అదనంగా బెదిరించాడు. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జూబ్లీ పోలీసులు ఇటీవల నకిలీ వరుడు హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణను మార్చిలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా పరిణామంలో షాదీ డాట్ కామ్ తమ ప్రతినిధులపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయాల్సిందిగా కోర్టులో ప్రయత్నించగా, దీనికి కోర్టు నిరాకరించింది. ఇరువైపులా వాదనల్లో షాదీ డాట్ కామ్ లొసుగుల్ని ప్రత్యర్థి అడ్వొకేట్ బయటపెట్టారు. పోలీసులు తమ విచారణలో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఫేక్ ప్రొఫైల్స్ ని అప్ లోడ్ చేస్తున్నాయని కనుగొన్నారు. చీటింగ్ కేసులో ప్రస్తుతం షాదీ డాట్ కామ్ యజమానులు సహా ఎగ్జిక్యూటివ్ లపై విచారణ కొనసాగుతోంది. తాజా కేసును పరిశీలించాక యువతరం పెళ్లిళ్ల వెబ్ సైట్ల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.