Begin typing your search above and press return to search.

మస్క్ తో మూడు చెరువుల నీళ్లు తాగించిన ఎక్స్‌... డిటైల్స్ ఇవే!

ఎన్నో రకాల వ్యాపారాలతో వేల కోట్లు సంపాదించి అత్యంత సంపన్నడిగా ఎదిగిన మస్క్ కు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయంట

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:23 AM GMT
మస్క్ తో మూడు చెరువుల నీళ్లు తాగించిన ఎక్స్‌... డిటైల్స్ ఇవే!
X

ఎలాన్ మస్క్... సంచలనాలే జీవితం అన్నట్లుగా ఉంటుంది ఈయన వ్యవహారం! ఈ ప్రపంచ కుబేరుడు, అమెరికన్‌ బిలియనీర్ గతకొంతకాలంగా నిత్యం వార్తల్లో నానుతూ ఉంటున్నారు. తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, చేస్తున్న ఛాలెంజ్ లు వెరసి ఆన్ లైన్ వేదికగా నిత్యం హాట్ టాపిక్ గా మారుతుతున్నారు మస్క్! ఈ క్రమంలో తాజాగా ఆయనను గురించిన ఒక విషయం తాజా హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నో రకాల వ్యాపారాలతో వేల కోట్లు సంపాదించి అత్యంత సంపన్నడిగా ఎదిగిన మస్క్ కు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయంట. ఎన్ని వ్యాపారాలు చేసినా ఏనాడూ ఇబ్బందులు ఎదర్కున్నట్లు కనిపించని మస్క్ కు ఇప్పుడు ట్విట్టర్ (ఎక్స్) కష్టాలు వెంటాడుతున్నాయంట. ఎక్స్ వల్లే కష్టాలంట!

అవును... ట్విటర్‌ ను సుమారు 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయడంకోసం.. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పే ఒక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్విటర్‌ కొనుగోలు సమయంలో తన రాకెట్ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ నుంచి 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8,314 కోట్లు) రుణాన్ని తీసుకున్నారంట. ఈ విషయాన్ని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా ఓ కథనం ద్వారా వెలువరించింది.

ఇందులో భాగంగా... గత అక్టోబర్‌ లో ఎలాన్‌ మస్క్‌ కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని స్పేస్ ఎక్స్ ఆమోదించిందని.. ఆ మొత్తాన్ని మస్క్ ఆ నెలలోనే డ్రా చేశారని చెబుతూ... కొన్ని పత్రాలను ఉటంకిస్తూ కథనం రాసింది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌.

దీంతో... ట్విటర్‌ ని కొనుగోలు చేయడం అనేది మస్క్ ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని, టెస్లాతో సహా తన ఇతర కంపెనీలలో తన షేర్ల మీద రుణం తీసుకోవడానికి బ్యాంకులతో ఏర్పాట్లు చేసుకున్నాడని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో దీనికోసం స్పేస్‌ ఎక్స్ రుణదాతగా వ్యవహరించిందని ఆ కథనం తెలిపింది.

కాగా రుణం తీసుకున్న ఆ అక్టోబర్ నెలలోనే మస్క్ ట్విటర్‌ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో స్పేస్‌ ఎక్స్‌ లో మస్క్‌ కు అత్యధిక వాటా ఉంది. మార్చి నాటికి ఆయన కంపెనీలో 42 శాతం వాటా, సుమారు 79 శాతం ఓటింగ్ శక్తి కలిగి ఉన్నట్లు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ లో దాఖలు చేసిన నివేదిక తెలిపింది!