Begin typing your search above and press return to search.

డ్రైవర్ అవసరం లేని డ్రోన్.. గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చు

రెండేళ్లకు ఒకసారి నిర్వహించే వింగ్స్ ఇండియా 2024కు హైదరాబాద్ వేదికగా మారింది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 3:55 AM GMT
డ్రైవర్ అవసరం లేని డ్రోన్.. గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చు
X

రెండేళ్లకు ఒకసారి నిర్వహించే వింగ్స్ ఇండియా 2024కు హైదరాబాద్ వేదికగా మారింది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఎయిర్ షోలో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షించేలా ఉన్నాయి. ఈ స్టాళ్లలో అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసిన వాటిల్లో డ్రైవర్ అవసరం లేకుండా.. గమ్యస్థానానికి చేర్చే డ్రోన్ కారు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ ఎయిర్ షోలో ఏర్పాటు చేసిన 130 స్టాళ్లలో అత్యధికంగా దేశీయ సంస్థలకు చెందినవే కావటం విశేషంగా చెప్పాలి. ట్రాఫిక్ జాంతో కిందా మీదా పడే పరిస్థితులున్న నేపథ్యంలో.. అలాంటి చిక్కులతో సంబంధం లేకుండా డ్రోన్ కారులో ఎంచక్కా ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేర్చే డ్రోన్ కారును సిద్దం చేసింది నియో ఏరియల్ అడ్విన్స్ డ్ సిస్టం. గ్రామాల నుంచి పట్టణాలకు సులువుగా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు తమ డ్రోన్ కారు సాయం చేస్తుందని చెబుతున్నారు.

ఇద్దరు ప్రయాణించే ఈ డ్రోన్ కారులో.. 40కి.మీ. ప్రయాణించొచ్చు. గంటకు గరిష్ఠంగా 100 కి.మీ. వేగంగా ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న 4 రోటర్ల కారణంగా ప్రమాదం జరిగే వీల్లేదని దీన్ని తయారు చేసిన సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. తాము రూపొందించిన మరో డ్రోన్ వాహనంలో గంటకు 400కి.మీ. వేగంతో ఐదుగురు 1500 కి.మీ. ప్రయాణించే వీలున్న వాహనాన్ని సిద్దం చేశారు.

ఈ డ్రోన్ కారులో విమానంలో మాదిరి ఇంజిన్.. హెలికాఫ్టర్ లో మాదిరి రోటర్లు ఉంటాయని. హెలిపాడ్ స్థలం నుంచే టేకాఫ్.. ల్యాండింగ్ తీసుకోవచ్చు. జీపీఎస్ సాయంతో గమ్యస్థానానికి చేరుకుంటుంది. మధ్యలో ఎదురయ్యే అడ్డంకుల్ని ఎదుర్కొనేందుకు సెన్సార్లను అమర్చిన్టుల చెబుతున్నారు. కాకుంటే.. ప్రస్తుతానికి ఈ ఉత్పత్తికి సంబంధించిన ప్రయోగాలు పూర్తి అయ్యాయని.. కేంద్రం తీసుకొచ్చిన విధివిధానాలకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసి అందరికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్ని బాగున్నాయి కానీ ఖరీదు మాటేమిటి? అంటే మాత్రం కాస్తంత ఖరీదైన వ్యవహారంగా చెబుతున్నారు.