Begin typing your search above and press return to search.

భార్య వేరే వారితో క్లోజ్ గా ఉంటుందని ఫ్రెండ్ ను చంపేశాడు

ఇదేమీ తెలియని కిశోర్ పార్టీకి వెళ్లాడు. మధ్యలో మాట్లాడుకోవటానికి అన్నట్లుగా బయటకు తీసుకెళ్లాడు. మూడో అంతస్తు మీద నుంచి కిశోర్ ను కిందకు తోసేసి..పరారయ్యాడు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:37 AM GMT
భార్య వేరే వారితో క్లోజ్ గా ఉంటుందని ఫ్రెండ్ ను చంపేశాడు
X

అనుమానం పెనుభూతమంటారు. తాజా ఉదంతాన్ని చూస్తే నిజమనిపించకమానదు. భార్య మీద అనుమానం.. స్నేహితుడ్ని చంపేసేలా చేసింది. అలా అని.. నిందితుడి భార్యకు.. స్నేహితుడుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. షాకింగ్ గా మారిన ఈ హత్యను చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే. విశాఖలో చోటు చేసుకున్న ఈ హత్య విస్మయానికి గురి చేస్తోంది.

రామాటాకీస్ కు దగ్గర్లోని శ్రీనగర్ కు చెందిన శివారెడ్డికి రెల్లివీధికి చెందిన కిరణ్ ద్వారా 26 ఏళ్ల కిశోర్ అనే వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరూ స్నేహితులుగా మారారు. కిశోర్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఇటీవల జాబ్ మానేయటంతో.. ఖాళీగా ఉంటున్నాడు. మరోవైపు శివారెడ్డి గంజాయి.. మద్యానికి బానిసై.. భార్యను అనుమనించేవాడు. తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. దీంతో.. అతడి వేధింపులు భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో కిశోర్ స్నేహితుడు ఉదయ్ కాస్తంత చనువుగా ఉండేవాడు. దీన్ని చూసి.. శివారెడ్డి తట్టుకోలేకపోయేవాడు. తన భార్యతో ఉదయ్ సన్నిహితంగా ఉండటానికి కిశోర్ సాయం చేస్తున్నాడని అనుమానించాడు. అతడ్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో..కిశోర్ తో మరింత స్నేహంగా ఉన్నట్లుగా నటించాడు. ఆదివారం రాత్రి మద్యం తాగేందుకు తన అపార్టుమెంట్ కు రావాలని కిశోర్ ను.. మరో ముగ్గురు స్నేహితుల్ని పిలిచిన శివారెడ్డి.. పార్టీ చేశాడు.

ఇదేమీ తెలియని కిశోర్ పార్టీకి వెళ్లాడు. మధ్యలో మాట్లాడుకోవటానికి అన్నట్లుగా బయటకు తీసుకెళ్లాడు. మూడో అంతస్తు మీద నుంచి కిశోర్ ను కిందకు తోసేసి..పరారయ్యాడు. పెద్ద శబ్ధం రావటంతో.. మిగిలిన స్నేహితులు బయటకు వచ్చి చూడగా.. కింద రక్తపు మడుగులో కిశోర్ పడి ఉన్నాడు. అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మరణించాడు. స్నేహితుడ్ని హత్య చేసిన శివారెడ్డి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.