Begin typing your search above and press return to search.

స్టార్‌ డైరెక్టర్‌ పై వైసీపీ గురి!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది

By:  Tupaki Desk   |   5 Jan 2024 5:58 AM GMT
స్టార్‌ డైరెక్టర్‌ పై వైసీపీ గురి!
X

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. కాపు సామాజికవర్గంలో అత్యధిక భాగం కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించిందని చర్చ జరుగుతోంది.


ఈ దిశగా ఇప్పటికే ప్రముఖ క్రికెటర్, కాపు సామాజికవర్గానికే చెందిన అంబటి రాయుడును వైసీపీ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేస్తున్నారు. ఆయనకు గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇస్తారని గట్టి ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. వాస్తవానికి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను లక్ష్యంగా చేసుకుని గతంలో విమర్శలు చేయడం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి మద్దతుగా మాట్లాడటం వంటి చర్యల ద్వారా ముద్రగడ పద్మనాభం తన రూటు ఎటో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. ముద్రగడ పద్మనాభంకు లేదా ఆయన కుమారుడు గిరిబాబుకు కాకినాడ ఎంపీ సీటును ఇస్తారని చెబుతున్నారు.

అలాగే దివంగత నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాను చేర్చుకోవడంపైనా వైసీపీ దృష్టి సారించిందని వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి.. వంగవీటి రాధాతో చర్చలు జరిపారని టాక్‌ నడిచింది. అయితే రాధా ఆయనకు ఏ హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో గతంలో రాధా అడిగిన విజయవాడ సెంట్రల్‌ సీటును వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారని అంటున్నారు.

ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ పై వైసీపీ దృష్టి సారించిందని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన వివి వినాయక్‌ సైతం కాపు సామాజికవర్గానికి చెందినవారే. గతంలో ఒకటి రెండు సందర్భాల్లో వినాయక్‌.. వైసీపీ అధినేత జగన్‌ కు అనుకూలంగా మాట్లాడారని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే వివి వినాయక్‌ ను నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపుతారని వార్తలు వచ్చాయి.

అయితే ఈసారి మాత్రం వినాయక్‌ ను వైసీపీలోకి తీసుకురావడానికి భారీ కసరత్తే చేస్తున్నారని అంటున్నారు. అయితే మెగాస్టార్‌ చిరంజీవికి వీరాభిమాని, మెగా క్యాంపులోని కీలక వ్యక్తి అయిన వినాయక్‌ వైసీపీ ఆఫర్‌ కు స్పందిస్తారో, లేదో చూడాల్సి ఉంది. వినాయక్‌ వైసీపీలో చేరితే ఆయనకు ఏలూరు లేదా రాజమండ్రి ఎంపీ సీటును ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఏలూరు, రాజమండ్రి ఎంపీ సీట్లకు సంబంధించి వైసీపీకి అభ్యర్థులు లేరు. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్‌ తాను వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేస్తానని జగన్‌ కు చెప్పినట్టు సమాచారం. అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వీవీ వినాయక్‌ పార్టీలోకి వస్తే ఆయనను రాజమండ్రి లేదా ఏలూరు లోక్‌ సభా స్థానాల నుంచి బరిలోకి దింపొచ్చని ప్రచారం జరుగుతోంది.