Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో కీలక పరిణామం!

కాగా తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవ అప్రూవర్‌ గా మారాడు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 7:19 AM GMT
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో కీలక పరిణామం!
X

ఢిల్లీ మద్యం కుంభకోణం దేశంలోనే సంచలనాలకు కారణమైన సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారులంతా సిండికేటుగా మారడంతోపాటు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం ద్వారా తమకు అనుకూలంగా మద్యం పాలసీ వచ్చేలా చేశారని.. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిలే చేశారని అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్టు చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్‌ చంద్రారెడ్డిని, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవను, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తదితరులను సీబీఐ అరెస్టు చేసింది. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను పలుమార్లు విచారించింది.

ఈ క్రమంలో శరత్‌ చంద్రారెడ్డికి బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. అలాగే మాగుంట రాఘవకు కూడా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్‌ రద్దు అయ్యింది.

ఈ మేరకు రాఘవ మధ్యంతర బెయిల్‌ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో జూన్‌ 12న రాఘవ సరెండర్‌ అయ్యారు. మాగుంట రాఘవ ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సౌత్‌ గ్రూప్‌ లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ అభియోగాలు మోపింది.

కాగా తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవ అప్రూవర్‌ గా మారాడు. ఈ కేసులో నగదు అక్రమ చలామణీ వ్యతిరేక చట్టం (మనీలాండరింగ్‌) కింద నిందితులుగా ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్, ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్‌ అరోరా అప్రూవర్లుగా మారేందుకు ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

అలాగే రాఘవ్‌ తో పాటు ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్‌ అరోరా సైతం అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు సీబీఐ స్పెషల్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌ పాల్‌ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో మరో నిందితునిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్‌ గా మారిన సంగతి తెలిసిందే.