Begin typing your search above and press return to search.

లిక్కర్‌ స్కామ్‌.. ఈడీ అధికారిపై సీబీఐ కేసు!

లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు అమన్‌ సింగ్ ధల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ అభియోగాలు మోపింది

By:  Tupaki Desk   |   29 Aug 2023 3:54 AM GMT
లిక్కర్‌ స్కామ్‌.. ఈడీ అధికారిపై సీబీఐ కేసు!
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఒకప్పుడు ఫుల్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఏరోజు ఏమి జరుగుతుందో.. ఏ రోజు ఎవరి అరెస్ట్ ఉంటుందో అన్నస్థాయిలో సస్పెన్స్ గా నడిచేది. అయితే కొంతకాలంగా ఈ కేసుకు స్థబ్ధగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక కీలకమైన విషయం తెరపైకి వచ్చింది.

చాలారోజులు లిక్కర్ కేసు స్థబ్దుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై మరిముఖ్యంగా తెలంగాణలో రాజకీయంగా పెను దుమారమే లేచింది. ఎన్నికలు సమీపిస్తున్న్న వేళ ఇక ఈ కేసు మూలన పడిందనుకున్న సమయంలో ఒక్కసారిగా సంచలన పరిణామం జరిగింది. ఇందులో భాగంగా... ఈడీ అధికారులు లంచం తీసుకున్నట్లు సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది.

అవును... ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్న పలువురు ఈడీ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరిలో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రితో పాటు ఎయిరిండియా ఉద్యోగి దీపక్‌ సంగ్వాన్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ నితేష్‌ కోహర్‌, క్లారిడ్జెస్‌ హోటల్స్‌ సీఈవో విక్రమాదిత్య ఉన్నారు!

లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు అమన్‌ సింగ్ ధల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ అభియోగాలు మోపింది. మనీలాండరింగ్ వ్యాపారి అమన్‌ దీప్ నుంచి ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. త్వరలోనే వారందర్నీ సీబీఐ అధికారులు విచారణకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిసెంబరు 2022 నుంచి జనవరి 2023 మధ్య కాలంలో తాము ప్రవీణ్‌ అనే ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ కు రూ.5 కోట్లు ఇచ్చినట్లు అమన్‌ దీప్‌, ఆయన తండ్రి బీరేందర్‌ పాల్‌ ఈడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌ తనకున్న పరిచయాలతో ఈడీలోని అధికారులతో మాట్లాడి.. దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించేలా మాట్లాడతానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఈడీ ఆగస్టు 7న సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. అమన్‌ దీప్‌ నుంచి ప్రవీణ్‌, దీపక్‌ సంగ్వాన్‌ లు రూ.5 కోట్లు తీసుకున్నట్లు తెలిపింది. వీరంతా వసంత్ విహార్‌ లోని ఐటీసీ హోటల్ వెనుక పార్కింగ్ స్థలంlO కలుసుకున్నట్లు తెలియవచ్చింది. అక్కడే సంగ్వాన్, ఖత్రీలకు అమన్‌ దీప్ నుంచి తీసుకున్న రూ. 50 లక్షలు అడ్వాన్స్‌ ‌గా ఇచ్చినట్లు తేలిందని సమాచారం.

దీంతో ఈడీ ఫిర్యాదు మేరకు ఖత్రి, కోహర్‌, సంగ్వాన్‌, ప్రవీణ్‌, విక్రమాదిత్య సింగ్‌, అమన్‌ దీప్‌ సింగ్‌, బీరేందర్‌ పాల్‌ సింగ్‌ పై సీబీఐ కేసు నమోదు చేసింది.