‘కొవిడ్’ భూతానికి ఏడాదిలో 21 లక్షల మంది బలి
విన్నంతనే ఉలిక్కిపడేలా చేసే కొవిడ్ మహమ్మారికి ఎంత భారీగా ప్రాణాల్ని బలి తీసుకుందన్న విషయాన్ని గణాంకాల రూపంలో వెల్లడించిందో రిపోర్టు.
By: Tupaki Desk | 10 May 2025 9:52 AM ISTవిన్నంతనే ఉలిక్కిపడేలా చేసే కొవిడ్ మహమ్మారికి ఎంత భారీగా ప్రాణాల్ని బలి తీసుకుందన్న విషయాన్ని గణాంకాల రూపంలో వెల్లడించిందో రిపోర్టు. 2020 ఆరంభంలో విరుచుకుపడిన కొవిడ్ 2021లో ఎంత భారీగా ప్రాణాల్ని బలి తీసుకుందన్న విషయంపై అందరికి అవగాహన ఉన్నా.. అదెంత? అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే..తాజాగా విడుదలైన రిపోర్టు మాత్రం.. కొవిడ్ కు బలైన ప్రాణాల లెక్కల్ని కళ్లకు కట్టినట్లుగా వివరాల్ని అందజేస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం ఈ రిపోర్టును విడుదల చేసింది.
సివిల్ రిజిస్ట్రేషన్ సిసట్టం నివేదిక 2021 ద్వారా వెల్లడైన ఈ వివరాల్ని చూస్తే.. 2021లో దేశ వ్యాప్తంగా 1.02 కోట్ల మంది మరణించారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 21.08 లక్షల మంది అదనంగా చనిపోయారు. అంటే.. మొత్తం మరణాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 25.9 శాతం ఎక్కువ. మరి.. తెలుగు రాష్ట్రాల్లో మరణాలు ఎంత? అన్న ప్రశ్నకు ఈ రిపోర్టు సమాధానం ఇచ్చేసింది. 2021లో ఆంధ్రప్రదేశ్ లో 1.01 లక్షల మంది మరణించాగా.. తెలంగాణలో 31,298 మంది అధికంగా మరణించినట్లుగా తేల్చారు. అదే శాతాల్లో చెప్పాలంటే ఏపీలో అంతకు ముందు ఏడాది మరణాలతో పోలిస్తే 22.22 శాతం.. తెలంగాణలో 15.4 శాతం అధిక మరణాలు చోటు చేసుకున్నాయి.
తెలుగురాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర విభజనకు ముందు.. ఆ తర్వాతి సంవత్సరాల్లో నమోదైన మరణాల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. విభజన తర్వాత సంవత్సరాల్లో ఏపీలో కనిష్ఠంగా 0.85 శాతం నుంచి గరిష్ఠంగా 13.33 శాతం వరకు మరణాల్లో తేడాలు కనిపించాయి. కొవిడ్ భారీగా వ్యాప్తి చెందిన 2021లో మాత్రం మరణాల రేటు అంతకు ముందుతో పోలిస్తే 22.2 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇక.. తెలంగాణ విషయానికి వస్తే 2019కు ముందు మూడేళ్లు మరణాలు తక్కువగా నమోదయ్యాయి. అందుకు భిన్నంగా 2019లో మాత్రం అసాధారణంగా మరణాల రేటు అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 67.21 శాతం నమోదయ్యాయి. దీని కికారణం.. అంతకు ముందు సంవత్సరాల్లో మరణాలు తక్కువగా నమోదు కావటమే. తెలంగాణలో కనిష్ఠంగా 6.25 శాతం మరణాలు నమోదు కాగా.. గరిష్ఠంగా 13.34 శాతం నమోదయ్యాయి. 2021లో మాత్రం కొవిడ్ కారణంగా మరణాల్లో 15.40 శాతం పెరుగుదల కనిపించింది. ఇక.. 2021లో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న మరణాల్లో పురుషుల మరణాలు 60.8 శాతం ఉండగా.. మహిళలు మాత్రం 39.2 శాతం ఉండటం గమనార్హం.